బిజినెస్ డెస్క్, వెలుగు: ఐఐటీ స్టూడెంట్లను ఆకర్షించేందుకు పెద్ద కంపెనీలతో స్టార్టప్లు పోటీ పడుతున్నాయి. ఏడాదికి రూ.15 నుంచి రూ.35 లక్షల ప్యాకేజిని ఆఫర్ చేస్తున్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ కంపెనీల నుంచి స్టార్టప్, ఈ–కామర్స్ కంపెనీలకు పోటీ ఎక్కువగా ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి ఐఐటీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ ప్లేస్మెంట్ సీజన్లో పాల్గొనేందుకు సుమారు 78 స్టార్టప్లు రిజిస్టర్ చేసుకున్నాయని ఐఐటీ గౌహతి పేర్కొంది. స్పేస్టెక్ స్టార్టప్ కంపెనీ అగ్రికుల్, ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అబాకస్ ఏఐ, ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ రేజర్పేలు ప్లేస్మెంట్ సీజన్లో గురువారం నుంచి స్టార్టయ్యే ఫేజ్ 1 కింద రిజిస్టర్ చేసుకున్నాయని ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫిన్టెక్ కంపెనీలయిన నవీ, స్లైస్, జూపీ, గ్రో, ఈ–కామర్స్ కంపెనీ మీషోలు ఉద్యోగులను నియమించుకునేందుకు ఐఐటీల బాట పట్టాయి. టైగర్ గ్లోబల్కు చెందిన ఫిన్టెక్ కంపెనీ జార్ ఐఐటీ బీహెచ్యూ క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొంది. ఈ స్టార్టప్ కంపెనీ రూ.15–20 లక్షల ప్యాకేజిని ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రీలొకేషన్ బెనిఫిట్స్ను కూడా అందిస్తోంది. ‘ఫ్రెషర్స్ మా లాంటి స్టార్టప్లలో జాయిన్ అయ్యేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర స్టార్టప్ల నుంచి పోటీ ఉంటుందని అంచనావేస్తున్నాం’ అని జార్ సీఈఓ నిశ్చయ్ ఏజీ అన్నారు. తమ బిజినెస్ను విస్తరించుకోవాలని చూస్తున్న స్టార్టప్ కంపెనీలు ఐఐటీయన్లను నియమించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ‘మార్కెటింగ్ మేనేజర్, ఆపరేటింగ్ మేనేజర్ వంటి అన్ని రకాల జాబ్స్ రోల్స్లలో ఐఐటియన్లను నియమించుకోవాలని చూస్తున్నాం. విస్తరించే కొద్దీ ఐఐటీ వంటి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల స్టూడెంట్లను నియమించుకుంటాం’ అని టైడ్ ఇండియా డిప్యూటి కంట్రీ మేనేజర్ కుమార్ శేఖర్ అన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు ఈ ఏడాది ఐఐటీ ముంబైను కస్టమర్ల ఎక్స్పీరియెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ లోకోబజ్ ఎంచుకుంది. ఈ స్టార్టప్ కంపెనీ సగటున రూ.18–20 లక్షల ప్యాకేజిని ఆఫర్ చేస్తోంది. ఇందులో పెర్ఫార్మెన్స్ను బట్టి ఇచ్చే రూ.2 లక్షల బోనస్ కలిసి ఉంది. డేటా సైంటిస్ట్, సర్వీస్ హెడ్ వంటి జాబ్ రోల్స్ కోసం ఈ కంపెనీ హైరింగ్ చేపడుతోంది. బెంగళూరు స్టార్టప్ కంపెనీ అస్సిడస్ ఈ–కామర్స్ యాక్సిలరేటర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఫ్రెషర్లకు నెలకు రూ. లక్ష ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ కూడా ఐఐటీ ప్లేస్మెంట్స్లో పాల్గొంటోంది. రూ.26–33 లక్షలు శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేస్తోంది.
రూ.కోట్లలో జీతాలు..
ఐఐటీ స్టూడెంట్లను నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు రూ. కోట్లల్లో జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల మొదటి రోజే ఐఐటీ ఢిల్లీ, కాన్పూర్, బాంబేల నుంచి ముగ్గురు చొప్పున స్టూడెంట్లకు రూ. 4 కోట్ల శాలరీ ప్యాకేజి ఆఫర్స్ దక్కాయి. మొత్తం 445 మంది ఐఐటీ మద్రాస్ స్టూడెంట్లకు జాబ్ ఆఫర్స్ అందగా, ఇందులో 25 మందికి రూ.కోటికి పైగా శాలరీని ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఐఐటీ గౌహతికి చెందిన స్టూడెంట్లకు 40 కంపెనీలు 168 జాబ్ ఆఫర్స్ ఇచ్చాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, క్వాంటిటేటివ్ డేటా ఎనలిస్ట్, కోర్ ఇంజినీర్, యూఎక్స్ డిజైనర్ వంటి జాబ్ రోల్స్ కోసం ఆఫర్స్ వచ్చాయి. ఐఐటీ మద్రాస్, ఢిల్లీ, హైదరాబాద్, బోంబే, రూర్కీ, ఖరగ్పూర్, కాన్పూర్, గౌహతి, బీహెచ్యూల నుంచి 200 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని శామ్సంగ్ చూస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబర్, క్వాల్కమ్, ఒరాకిల్, శాప్ ల్యాప్స్, గోల్డ్మాన్ శాచ్స్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, జేపీ మోర్గాన్, ఓఎన్జీసీ, ఫ్లిప్కార్ట్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్టీమైక్రోఎలక్ట్రానిక్స్ వంటి టాప్ కంపెనీలు ఈసారి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పాల్గొంటున్నాయి.