
- తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్బాడీల దహనం
- ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్
- నారాయణపూర్లోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసుల కండీషన్
- వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు
- తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవరావుతో సహా 8 మంది మావోయిస్టుల మృతదేహాలను చత్తీస్ గఢ్లోని నారాయణ్పూర్ పోలీసులు సోమవారం దహనం చేశారు. నంబాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వాటిని పోలీసులు పట్టించుకోలేదు. చత్తీస్గఢ్కు చెందినోళ్ల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది డెడ్బాడీలను మాత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నెల 21న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మరుసటిరోజే వీరి డెడ్బాడీలన్నీ నారాయణపూర్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబ సభ్యులంతా 5 రోజులుగా మృతదేహాల కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. నంబాల డెడ్బాడీ అప్పగింతపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేశవ రావు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ సజ్జ వెంకట నాగేశ్వర రావు, లలిత, విజయలక్ష్మి, రాకేశ్తో సహా మరో ముగ్గురి డెడ్బాడీలను కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు నారాయణపూర్ పోలీసులు నిరాకరించారు. సోమవారం సాయంత్రం 4 గంటల్లోపు డెడ్బాడీలను ఇక్కడే ఖననం చేయాలని కండీషన్ పెట్టారు. లేదంటే తామే దహనం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల కండీషన్కు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
డెడ్బాడీలు ఇస్తే స్వగ్రామాలకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేపడ్తామన్నారు. చివరికి 8 మంది మావోయిస్టుల డెడ్బాడీలకు ఆదివాసీ ముక్తిధామ్లో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. పోలీసులు డెడ్బాడీలను దహనం చేయడం చర్చనీయాంశం అవుతున్నది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల డెడ్బాడీలను ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా నారాయణపూర్ పోలీసులు టైమ్పాస్ చేశారని చత్తీస్గఢ్ పౌరహక్కుల సంఘం నేత బేలా భాటియా ఆరోపించారు.
హైకోర్టు ఆదేశాలున్నా.. డెడ్బాడీలు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం ఇదే తొలిసారని తెలిపారు. కేంద్రం కావాలనే ఇలా చేసిందని పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడ్తున్నారు. నంబాల కేశవ రావుది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. నక్సల్ బరి ఉద్యమం ఈ జిల్లాలోనే ఊపిరి పోసుకున్నది. ఈ నేపథ్యంలో నంబాల డెడ్బాడీ అప్పగిస్తే తిరిగి ఉద్యమం బలపడుతుందనే భయం కేంద్రం ప్రభుత్వం, పోలీసుల చర్యల్లో కనిపిస్తున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.