- కామారెడ్డి జిల్లాలో 86.08 శాతం పోలింగ్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ డివిజన్లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,38,838 ఓటర్లలో పురుషులు 1,10,927, మహిళలు 1,27,906 ఇతరులు ఐదుగురు ఉండగా 1,83,219 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వారిలో మహిళలు 1,06,737, పురుషులు 76,479 ఇతరులు ముగ్గురు ఉన్నారు. పురుషుల ఓటింగ్ 68.95 శాతం ఉండగా మహిళలు 83.45 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, మాక్లూర్, మొపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ మండలాల్లోని 1,476 పోలింగ్ సెంటర్లకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. డివిజన్లో మొత్తం 196 గ్రామ పంచాయతీలకు 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగితా 158 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం1,760 వార్డుల్లో యునానిమస్ వార్డులు మినహాయించి 1,081 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. సర్పంచ్ స్థానాలకు 568, వార్డుల నుంచి 2,634 మంది తలపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సెంటర్స్లోకి వచ్చిన వారిని మాత్రమే ఓటింగ్కు అనుమతించారు. తరువాత గేట్లు క్లోజ్ చేశారు. గంట భోజన విరామం తరువాత కౌంటింగ్ చేపట్టిన అధికారులు.. మొదట వార్డు మెంబర్ల రిజల్ట్ తరువాత సర్పంచ్ రిజల్టు ప్రకటించారు.
వార్డు సభ్యులుగా గెలిచిన వారిని బయటకు వెళ్లనీయకుండా ఒక రూమ్ కేటాయించి, సర్పంచ్ రిజల్టు వచ్చాక అందరినీ హాజరుపర్చి చివర్లో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా 1,120 పోలీస్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్గా గుర్తించిన 59 పోలింగ్ సెంటర్స్లో పోలింగ్, కౌంటింగ్ను వెబ్ కాస్టింగ్ ద్వారా సీపీ సాయిచైతన్య పరిశీలించారు.
కామారెడ్డి జిల్లాలో 86.08 శాతం పోలింగ్
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లోని లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని పిట్లం, నిజాంసాగర్, మహామ్మద్నగర్ మండలాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్, కౌంటింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
రెండో విడతలో ఎన్నికలు జరిగిన 7 మండలాల్లో మొత్తం 197 పంచాయతీలకు 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 153 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే సర్పంచ్ అభ్యర్థులుగా 506 మంది పోటీ చేశారు. వార్డు స్థానాలు మొత్తం 1,654 లో 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలకు నామినేషన్లు రాలేదు.
873 వార్డుల్లో 2,655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఆయా చోట్ల ఎన్నికలు తీవ్ర ఉత్కంటను లేపాయి. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 1,64,301 మందిలో పురుషులు 78,476 మంది, మహిళలు 85,822 మంది, ఇతరలు 3 ఉన్నారు. ఇందులో పురుషులు 67,768 మంది, మహిళలు 73,656 మంది, మొత్తం 1,41,424మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
86.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది తమ ఓటు వేశారు. మహిళల ఓటింగ్ శాతం 85.82 శాతం నమోదు కాగా పురుషులు 86.36 శాతం నమోదైంది. అత్యధిక పోలింగ్ ఎల్లారెడ్డి మండలంలో 89.72 శాతం, అతి తక్కువగా 83.64 శాతం నమోదైంది. యువత, వృద్ధులు ఆయా గ్రామాల్లో ఉత్సహాంగా వచ్చి ఓట్లు వేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం మండల కేంద్రంలో ఓటు వేశారు.
లింగంపేట మండలం నల్లమడుగులో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేంధర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ పక్రియ మధ్యాహ్నాం 2 గంటల తర్వాత ప్రారంభమైంది. తక్కువ ఓట్లు ఉన్న గ్రామాల్లో 2 గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు రాగా ఎక్కువ ఓట్లు, మేజర్ పంచాయతీల్లో రాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది.
పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
ఎన్నికల సరళిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర పర్యవేక్షించారు. గాంధారి, లింగంపేట, పిట్లం, ఎల్లారెడ్డి, మహామ్మద్నగర్ మండలాల్లో వీరు పర్యటించారు. ఓటర్లతో మాట్లాడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, యువతతో పాటు, వృద్ధులు కూడా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో పార్థసారధిరెడ్డి తదితరులు ఉన్నారు.
పోలింగ్ ఆరంభంలో చలి ఎఫెక్ట్
అన్ని సెంటర్స్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూకాగా ప్రతి రెండు గంటలకోసారి ఆఫీసర్లు పోలింగ్ శాతాన్ని ప్రకటించారు. చలి తీవ్రతతో ఉదయం 9 గంటల వరకు 20.49 శాతమే ఓటింగ్ జరిగింది. తరువాత ఓటింగ్ శాతం పెరిగింది. 11 గంటలకు 49.13 శాతం మధ్యాహ్నం ఒంటి గంటకు 76.71 శాతానికి చేరుకుంది. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్, సీపీ సాయిచైతన్య పోలింగ్తో కౌంటింగ్ను పరిశీలించారు.
