
- భారీగా తరలివచ్చిన అభిమానులు
బోథ్, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఆయన స్వగ్రామం పొచ్చరలో ముగిశాయి. కుటుంబీకులు, ప్రజా సంఘాలు, విప్లవకారులు, అభిమానుల ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అడెల్లు అభిమానులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ( ఎంఎల్), సీపీఐ న్యూ డెమొక్రటిక్, ప్రజా సంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు, వివిధ గ్రామాల నుంచి వచ్చారు.
అడెల్లు భౌతికకాయంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై నివాళులు అర్పించారు. గ్రామంలోని పలు వీధుల గుండా నిర్వహించిన అంతిమ యాత్రలో అభిమానులు ఎర్రజెండాలు పట్టుకొని భాస్కర్ అన్న అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో గ్రామం మార్మోగింది. పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విరసం నేతలు, మాజీ మావోయిస్టులు, కళాకారులు పాటలు, నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేశారు. మాజీ మావోయిస్టులు ఉద్యమంలో అడెల్లుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. అడెల్లు అన్న పెద్ద అడెల్లు దహన సంస్కారాలు నిర్వహించారు.