
పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
బూటకపు ఎన్కౌంటర్లకు నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 3, 7, 19, 23 తేదీల్లో దేవర్లగూడెం, కదంబ, పూసుగుప్ప, చెన్నాపురం ప్రాంతాల్లో జరిగిన పోలీస్ఎన్కౌంటర్లన్నీ బూటకమేనంటూ ఆయన ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ మా ధ్యేయమంటూ నమ్మించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. అధికారం చేపట్టాక కేసీఆర్ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 16న రెండు గ్రేహౌండ్స్ దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లోనే ఆర్ఎస్సై చనిపోయారని పేర్కొన్నారు. పోలీసులు మాత్రం మిస్ఫైర్అవడం వల్లే ఆర్ఎస్సై మృతిచెందినట్టుగా పేర్కొంటున్నారని అన్నారు. దోపిడీ లేని తెలంగాణ కోసం, బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేపట్టాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర బంద్ లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు.
For More News..