నంబాలను పట్టుకుని కాల్చి చంపారు: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్

నంబాలను పట్టుకుని కాల్చి చంపారు: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్
  • లొంగిపోయిన ద్రోహుల సమాచారంతోనే ఎన్​కౌంటర్
  • మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్
  • ఎన్​కౌంటర్ మృతులు 27 కాదు.. 28 మంది
  • ఒక డెడ్​బాడీని తాము తీసుకెళ్లినట్టు ప్రకటన

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవరావును భద్రతా బలగాలే పట్టుకుని కాల్చి చంపాయని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సోమవారం లేఖ విడుదల చేసింది. కేశవ రావుది ఎన్ కౌంటర్ కాదని, హింసించి చంపారని కమిటీ సెక్రటరీ వికల్ప్ పేర్కొన్నారు. తమ నాయకుడిని కాపాడుకోవడంలో విఫలం అయ్యామని విచారం వ్యక్తం చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్​కౌంటర్ జరిగిందని మండిపడ్డారు. ‘‘అబూజ్​మడ్ ఎన్​కౌంటర్ లో చనిపోయింది 27 మంది కాదు.. 28 మంది. ఒక డెడ్​బాడీని మేమే తీసుకెళ్లినం. 6 నెలలుగా కేశవరావు అబూజ్​మాడ్ ఏరియాలోనే ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలుసు. కేశవ రావు టీంలో ఉన్న ఆరుగురు.. ఇటీవల లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే భద్రతా బలగాలు పట్టుకుని చంపేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్​కౌంటర్ కథ అల్లుతున్నది. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్​కౌంటర్ జరిగింది’’అని లేఖలో వికల్ప్ పేర్కొన్నారు. 

ఎన్​కౌంటర్ ముందు రోజు నుంచి 20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, 10 గంటల్లో 5 ఎన్​కౌంటర్లు జరిగాయని తెలిపారు. ‘‘60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్బంధించాయి. కేశవరావును కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. ఎన్​కౌంటర్ నుంచి ఏడుగురు సేఫ్​గా బయటపడ్డారు. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించాం. మా వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగలేదు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ.. మమ్మల్ని వదిలి వెళ్లడానికి ఆయన ఇష్టపడలేదు. నాయకుడే ముందుండి నడిపించాలని మాతోనే ఉన్నరు’’అని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్​తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం.. తమతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు.