కొత్తగూడెంలో మార్కెట్​ ఏరియాలు కోట్లు ఖర్చు చేసి.. ఖాళీగా వదిలేశారు

కొత్తగూడెంలో మార్కెట్​ ఏరియాలు కోట్లు ఖర్చు చేసి.. ఖాళీగా వదిలేశారు
  • మందుబాబులకు అడ్డాగా మారిన మార్కెట్​ షాపింగ్​ కాంప్లెక్స్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెం పట్టణంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన    మార్కెట్​ ఏరియాలు నిరూపయోగంగా మారాయి.  నేతాజీ మార్కెట్లలో నిర్మించిన షాపింగ్​  కాంప్లెక్స్​  వృథాగా మారింది.  వీధి వ్యాపారుల కోసం ఈ షాపింగ్​ కాంప్లెక్స్​లను రెండేండ్ల కింద  నిర్మించారు.  కానీ, నేటికి ఇవి కాళీగా ఉండడంతో.. మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి.  

మరోవైపు వ్యాపారులు రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో  ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలుగుతోందని,  ఎండాకాలం, వానా కాలంలో  వ్యాపారులకు ఇబ్బందులు వస్తున్నాయని   షాపింగ్​ కాంప్లెక్స్​లు నిర్మించారు. కానీ,  వ్యాపారులను షాపింగ్​ కాంప్లెక్స్​లకు తరలించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు. గవర్నమెంట్​ హాస్పిటల్​ ప్రాంతంలో   అవసరం లేకున్నా ఆఫీసర్లు  మార్కెట్​ కాంప్లెక్స్​ను నిర్మించారనే  ఆరోపణలు ఉన్నాయి.  

మరో వైపు నేతాజీ మార్కెట్​ నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ వ్యాపారాలు చేసుకునే విధంగా లేవని పలువురు చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. అవి గోదాములగా మాత్రమే ఉపయోగ పడ్తాయని  అంటున్నారు.   రూ. కోటితో ఎంజీ రోడ్​ సమీపంలో అసంపూర్తి నిర్మించిన వాటిని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హడావుడిగా, ఆర్బాటంగా ప్రారంభించారు. కానీ ఇంత వరకు ఆ నిర్మాణం పూర్తి కాలేదు.