ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా విత్తనాల పంపిణీ

ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా విత్తనాల పంపిణీ

కాగజ్ నగర్/లక్సెట్టిపేట/ తాండూరు/తిర్యాణి,మందమర్రి, వెలుగు: ప్రభుత్వం అందించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు  రైతులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను మండల కేంద్రాలు, గ్రామాల్లో పంపిణీ చేశారు. వ్యవసాయంలో టెక్నాలజీ ఎంత వచ్చినా పాత పద్ధతులను మరువద్దని కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య అన్నారు.

 కౌటాల రైతు వేదికలో ఆదిలాబాద్ వ్యవసాయ కాలేజీ  ప్రొఫెసర్ కుమారస్వామి , మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రేమలతతో కలిసి ప్రొఫెసర్  జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఫౌండేషన్ సీడ్ ను పంపిణీ చేశారు. రైతులు తమ చేనులో పండిన పంట నుంచి నాణ్యమైన విత్తనాలు వేరు చేసి వాటిని నిల్వ చేసి మళ్లీ పంటసాగు లో వాడుకోవాలని సూచించారు. 

మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు చెందిన గుర్తించిన రైతులకు వరి, కంది, పెసర విత్తనాలు అందించారు. సహకార సంఘం సీఈవో రాజేశ్, ఏఈవోలు పాల్గొన్నారు. లక్సెట్టిపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి చెందిన ముగ్గురు అభ్యుదయ రైతులకు వరి, పెసర విత్తనాలను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ పంపిణీ చేశారు.

వ్యవసాయ శాస్త్రవేత్త సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలంలోని కొత్తపల్లి రైతు వేదికలో వ్యవసాయాధికారి సుష్మ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. తిర్యాణిలోని చింతపల్లి రైతు వేదికలో జయశంకర్ వర్సిటీ సైంటిస్ట్  బలరాంతో కలిసి కాంగ్రెస్ జిల్లా నేత జువ్వాజి అనిల్ గౌడ్ ఉచిత విత్తనాలను రైతులకు పంపిణీ  చేశారు. కంది, పెసర, వరి అందించారు.

రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎంఏవో వినయ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఈవోలు  పాల్గొన్నారు. మందమర్రి మండలం సండ్రోనిపల్లిలో జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త మధుకర్​విత్తనాలు పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తికి  ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు.