
- కంపెనీపై తాత్కాలికంగా బ్యాన్ విధించిన సెబీ
- రెండేండ్లలో రూ.36,671 కోట్ల లాభం
- మార్నింగ్ ఇండెక్స్ కంపెనీల్లో షేర్లను కొని నిఫ్టీ బ్యాంక్ను లేపేది..
- మధ్యాహ్నం ఈ షేర్లను అమ్మేసి ఇండెక్స్ను పడేసేది
- అదే టైమ్లో ఆప్షన్స్లో షార్ట్ పొజిషన్లను తీసుకునేది..
న్యూఢిల్లీ: ఇండియా స్టాక్ మార్కెట్లోని లోపాలను వాడుకొని యూఎస్ కంపెనీ ఒకటి భారీగా లాభాలు గడించింది. గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్ 2020 నుంచి ఇండియాలో పనిచేస్తోంది. జనవరి 2023 నుంచి మార్చి2025 వరకు భారత డెరివేటివ్స్(ఫ్యూచర్స్,ఆప్షన్స్) మార్కెట్లో అక్రమంగా రూ. 36,671 కోట్లను ఆర్జించిందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆరోపించింది. జేన్ స్ట్రీట్ను తాత్కాలికంగా భారత సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించి, రూ. 4,843 కోట్ల అక్రమ లాభాలను ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొంది.
మార్కెట్ మానిపులేషన్ ఎలా చేసిందంటే?
జేఎస్గ్రూప్ నిఫ్టీ బ్యాంక్ , నిఫ్టీ 50 ఇండెక్స్ ఆప్షన్స్లో రెండు స్ట్రాటజీలతో మార్కెట్ను మానిపులేట్ చేసిందని సెబీ తెలిపింది. మొదటి స్ట్రాటజీ: ఉదయం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ , ఫ్యూచర్స్ను భారీగా కొని ఇండెక్స్ను పైకి నెట్టి, మధ్యాహ్నం వాటిని అమ్మి ధరలు పడేలా చేసేవారు. ఇదే సమయంలో ఆప్షన్స్లో షార్ట్ (ఇండెక్స్ పడుతుందని బెట్ చేయడం) పొజిషన్లతో భారీ లాభాలు పొందేవారు.
నిఫ్టీ బ్యాంక్లో 12 ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ ఇండెక్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్కు వెయిటేజ్ ఎక్కువ. జనరల్గా ఈ షేర్లు పెరిగితే ఇండెక్స్ మొత్తం పెరుగుతుంది. జేఎస్ గ్రూప్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్న షేర్లను మార్నింగ్ కొని నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ను పైకి లేపేది. మధ్యాహ్నం సెషన్లో ఈ షేర్లను అమ్మేసేది. దీంతో ఇండెక్స్ పడేదే. ఇదే టైమ్లో నిఫ్టీ బ్యాంక్ పడుతుందని ఆప్షన్స్, ఫ్యూచర్స్ (డెరివేటివ్స్) లో షార్ట్ పొజిషన్లు తీసుకునేది.
షేర్లను మార్నింగ్ కొని, మధ్యాహ్నం అమ్మడం వలన లాస్ వచ్చినా, ఆప్షన్స్లో భారీ లాభాలు పొందింది. నిఫ్టీ 50 ఇండెక్స్పై కూడా ఈ వ్యూహాన్నే వాడింది.
రెండో స్ట్రాటజీ: ఎక్స్పైరీ రోజు చివరి రెండు గంటల్లో భారీ కొనుగోలు లేదా విక్రయాలతో ఇండెక్స్ స్థాయిలను జేఎస్ గ్రూప్ ప్రభావితం చేసేది. దీనివల్ల ఆప్షన్స్ ప్రీమియంల విలువ (ధరలు) కంపెనీ తీసుకున్న పొజిషన్లకు అనుకూలంగా మారేవి. జనవరి 2023 నుంచి మే 2025 వరకు 21 ఎక్స్పైరీ రోజుల్లో ఈ వ్యూహాలను ఉపయోగించారని సెబీ పేర్కొంది.
ఎంత సంపాదించిందంటే?
సెబీ పరిశీలన ప్రకారం, జేఎస్ గ్రూప్ ఇండెక్స్ ఆప్షన్స్లో రూ. 44,358 కోట్ల లాభం సంపాదించింది. కానీ స్టాక్ ఫ్యూచర్స్ (డెరివేటివ్స్) లో రూ. 7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో రూ. 191 కోట్లు, క్యాష్ మార్కెట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. మొత్తంగా రూ. 36,671 కోట్ల నికర లాభం సాధించింది. ఇందులో రూ. 4,843 కోట్లు అక్రమ లాభాలుగా సెబీ గుర్తించింది. జేఎస్ గ్రూప్నకు చెందిన నాలుగు సంస్థలు ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. వీటిలో 2 ఎఫ్పీఐలుగా నమోదయ్యాయి.
సెబీ ఆరోపణలు..
సబ్సిడరీ జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్ సాయంతో ఎఫ్పీఐ (ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్ట్మెంట్స్) నిబంధనల్లోని లోపాలను వాడుకొని ఇంట్రాడే ట్రేడింగ్ను జేఎస్ గ్రూప్ చేసిందని సెబీ తెలిపింది. జేఎస్ గ్రూప్లోని ఎఫ్పీఐలు రూ. 32,681 కోట్ల లాభాలు బుక్ చేశాయి. ఇవి భారత్లో వారి సగటు ఆస్తుల కంటే ఎక్కువ. లాభాలు విదేశాలకు తరలించారని సెబీ తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరిక జారీ చేసినప్పటికీ, జేఎస్ గ్రూప్ ఈ వ్యూహాలను కొనసాగించిందని పేర్కొంది. దీంతో వీరిని మార్కెట్ నుంచి నిషేధించి, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది.