
వెలుగు నెట్వర్క్: గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నగరంలో పలు సంఘాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జోరుగా సాగింది. బంజారాహిల్స్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ నర్సయ్య మట్టి గణపతులను పంపిణీ చేశారు. నాచారం మహాకాళి సహిత మహా కాలేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన, యూత్ కాంగ్రెస్ లీడర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి, శంషాబాద్ మున్సిపాలిటీ ఆర్ బీ నగర్ కాలనీలో సీఐ బాలరాజు, సికింద్రాబాద్ సోమ సుందరం వీధిలో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, రంగారెడ్డి కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, రాంమందిరం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, రాంనగర్లోని గుండు లలితానగర్లో శ్రావణి ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందజేశారు.
విగ్రహాల కోసం ఎగబడ్డ జనం
హైదరాబాద్సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అధికారులు మట్టి విగ్రహాలు పంపిణీ చేయగా జనం ఎగబడ్డారు. డీసీఎం నుంచి విగ్రహాలను తీసి ఇస్తున్న క్రమంలో ఒకరిని ఒకరు తోసుకున్నారు. జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా 2 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తామని చెప్పింది. ఆదివారం నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా.. మంగళవారం అందజేయడంతో ప్రజలు ఎగబడ్డారు.