యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. సోమవారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘సామూహిక గిరిప్రదక్షిణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఆరంభించారు.
గిరిప్రదక్షిణలో భాగంగా భక్తులు రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
శాస్త్రోక్తంగా ‘అష్టోత్తర శతఘటాభిషేకం’
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. ఉత్సవంలో భాగంగా.. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వర్ణ ధ్వజస్తంభానికి ఎదురుగా శుద్ధ జలంతో కూడిన 108 వెండి కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణీకుల పారాయణాలు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు, జపాల మధ్య, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించారు.
