లోటస్​ పాండ్​లో భారీగా చేపల మృతి

లోటస్​ పాండ్​లో భారీగా చేపల మృతి
  • ఆందోళనకు గురైన వాకర్లు.. వాసన భరించలేక కంప్లయింట్​
  • శాంపిళ్లు తీసుకున్న అధికారులు 
  • ఆక్సిజన్ అందకపోవడమే కారణం!

ఖైరతాబాద్, వెలుగు : బంజారాహిల్స్​లోని లోటస్​ పాండ్​లో భారీగా చేపలు చనిపోయాయి. బుధవారం పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలు నీటిపై తేలుతూ కనిపించాయి. రోజూ వాకింగ్​కు వచ్చే వాళ్లు ఈ విషయాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు రోజుల నుంచి చేపలు చనిపోతున్నాయనీ, బుధవారానికి వాటి సంఖ్య బాగా పెరిగిందని వాకర్లు చెప్తున్నారు. బిజీ లొకాలిటీలో ఎంతో ప్రశాంతంగా ఉండే పాండ్​ఇలా మారడంతో వాళ్లు ఒకింత ఆందోళన చెందారు. వాకర్ల కంప్లయింట్​తో పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు, ఫిషరీస్ డిపార్ట్​మెంట్, జీహెచ్​ఎంసీ అధికారులు లోటస్​ పాండ్​ వద్దకు చేరుకున్నారు.

నీటి శాంపిళ్లు, చనిపోయిన చేపలను సేకరించి టెస్టింగ్​కు పంపించారు. చేపల సంఖ్య ఎక్కువై ఆక్సిజన్​ అందకనే చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఫిషరీస్ ​డిపార్ట్​మెంట్​అధికారులు ‘వెలుగు’తో చెప్పారు. ప్రస్తుతానికి చేపలకు ఆక్సిజన్ ​ట్యాబ్లెట్లు అందజేస్తామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి ఆ నీళ్లు పాండ్​లోకి వచ్చాయని వాకర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. వాకర్లు, చుట్టుపక్కల చిరు వ్యాపారాలు చేసేవాళ్లు చెరువులో వ్యర్థ్యాలు వేయొద్దని జీహెచ్​ఎంసీ అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.