నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ మండలం గుండారం శివారులోని క్లాసిక్ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ వివరాల ప్రకారం.. క్లాసిక్ పేపర్ మిల్లు ఆవరణలోని ఓ షెడ్డులో నిల్వ ఉంచిన పేపర్, ముడి సరుకుకు మంటలు అంటుకున్నాయి.
సిబ్బంది గమనించేలోపు మంటలు వ్యాపించడంతో నిల్వ ఉంచిన సుమారు 2000 టన్నుల పేపర్, ముడి సరుకుతో పాటు షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది పేపర్ మిల్లుకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లు మేనేజర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు.
