
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలోని జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి సూచించారు. శనివారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి జంక్షన్ల స్థితిగతులు, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బల్దియా హెడ్ఆఫీస్ ఎదుట, జెమినీ టాకీస్ జంక్షన్, పోతన రోడ్ జెండా ప్రాంతం ఎదుట, రామన్నపేట స్తూపం వద్ద, బీఆర్ నగర్ ప్రాంతం, హనుమకొండ కలెక్టర్ భవనం ఎదుటతో పాటు వివిధ జంక్షలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
మెట్టుగుట్టలోని ప్రధాన రహదారి పై జంక్షన్ ను అభివృద్ధి చేయాలని ఇదే ప్రాంతంలో స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన మేయర్ డ్రైనేజీ లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలన్నారు. కాగా, ఇటీవల సీడీఎంఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నగరంలో స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి పోతన రోడ్డు, బృందావన్ కాలనీలో రెండు చోట్ల వారు స్థల పరిశీలన చేశారు. వారివెంట వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.