- ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు!
- రాష్ట్రంలో 8 వేలు దాటిన సీట్ల సంఖ్య
- ఈసారి నీట్ లో 35 వేల మంది క్వాలిఫై అయ్యే చాన్స్
- 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,590 సీట్లు
- ప్రతి పది మందిలో ఒకరికి సర్కార్ కాలేజీలోనే సీటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నిరుడు రాష్ట్రంలో 6,690 సీట్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 1,450 సీట్లు అందుబాటులోకి రావడంతో మొత్తం సీట్ల సంఖ్య 8,140కి చేరింది. దీంతో ఈసారి నీట్ క్వాలిఫై అయ్యే ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి నీట్ రాస్తున్న వారిలో ఏటా సగటున 30 వేల మంది క్వాలిఫై అవుతున్నారు. కొత్త కాలేజీలు వస్తుండడం, సీట్ల సంఖ్య పెరుగుతుండడం వంటి సానుకూల అంశాలతో ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా సుమారు 65 వేల మంది నీట్ రాశారు. ఎగ్జామ్ పేపర్ కూడా గతంలో వచ్చినంత టఫ్గా రాలేదు. దీంతో ఈసారి 35 వేల మంది వరకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని నీట్ కోచింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే నిజమైతే దాదాపు క్వాలిఫై అయిన ప్రతి నలుగురిలో ఒకరికి సీటు వస్తుంది. అంతేకాదు ప్రతి పది మందిలో ఒకరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు దక్కుతుంది. మన రాష్ట్రంలో ఎయిమ్స్, ఈఎస్ఐసీ సహా 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా.. వాటిల్లో 3,590 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకో రెండు కాలేజీలకు సంబంధించిన అప్లికేషన్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటికి కూడా పర్మిషన్ వస్తే ఇంకో రెండొందల సీట్లు పెరుగుతాయి.
ప్రైవేటులోనూ సీట్లు ఫుల్..
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఫ్యాకల్టీ దొరకరు అని, కాలేజీలు మూతబడతాయన్న ప్రచారం జరిగింది. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగినట్టే, ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 4 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కాలేజీకి 150 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. వీటితో కలిపి కాలేజీల సంఖ్య 28కి పెరగ్గా, సీట్ల సంఖ్య 4,550కు చేరింది. ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. వీటిల్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ కూడా అత్యంత తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక గతేడాది నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వీటిల్లోనూ 90 నుంచి 95 శాతం సీట్లు మన స్టేట్ స్టూడెంట్లకే దక్కుతున్నాయి.
బీడీఎస్ సీట్లు 1,400
ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, ఆయుర్వేదిక్ సీట్లను కూడా నీట్లో వచ్చే ర్యాంక్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 14 డెంటల్ కాలేజీల్లో 1,400 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీటు రాని స్టూడెంట్లు లేదా డెంటిస్ట్గా సెటిల్ అవుదామనుకునే స్టూడెంట్స్ బీడీఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవికాకుండా ఆయుర్వేదిక్(బీఏఎంఎస్), యునాని(బీయూఎంఎస్), సిద్ధ(బీఎస్ఎంఎస్) కోర్సుల సీట్లను కూడా నీట్ ర్యాంక్తోనే భర్తీ చేస్తున్నారు. కరోనా తర్వాత ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్గా పిలిచే ఆయుర్వేద, యునాని కోర్సులకు కూడా డిమాండ్ పెరిగింది. ఈసారి బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా నీట్ ర్యాంక్తోనే భర్తీ చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచన మేరకు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.