ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఎండీ సజ్జనార్ క్లారిటీ

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఎండీ సజ్జనార్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెంపు ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సాధారణ ఛార్జీలపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సు సాధారణ చార్జీలు యథాతథంగానే కొనసాగుతాయని చెప్పారు. 

ఇటీవల హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని సజ్జనార్ తెలిపారు.  జూన్ 3వ తేదీ నుంచి సవరించిన టోల్ సెస్ అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు. దీంతో టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించిందని తెలిపారు.  సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేశారు. 

టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్  హెచ్చరించారు.