ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ MDH కంపెనీ ఓనర్ పద్మభూషన్ మహాశయ్ ధర్మపాల్ గులాటీ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపాల్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1923లో పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జన్మించిన గులాటీ…నాలుగో తరగతిలోనే చదువుకు పుల్ స్టాప్ పెట్టేశారు. ఉపాధికోసం ఢిల్లీలో జట్కాబండి నడుపుతూనే…మసాల సంస్థను స్థాపించి అంచలంచెలుగా ఎదిగారు. ముందు చిన్న బడ్డీకొట్టుతో ప్రారంభమైన ఆయన వ్యాపారం కొద్దికాలంలోనే పరిశ్రమ స్థాయికి ఎదిగి…మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఏడాదికి 900 కోట్ల టర్నోవర్ తో విదేశాల్లోనే ఆఫీసులు తెరిచే స్థాయికి ఎదిగింది కంపెనీ. అమెరికా, కెనడా, ఇంగ్లాడ్, జపాన్, యూఏఈ, సౌదీ దేశాలకు ఎండీహెచ్ మసాలా ఎగుమతి అవుతోంది.
వ్యాపార రంగంలోనే కాదు…దాన ధర్మాల్లోనూ గులాటీ ఎప్పుడూ ముందుండేవారు. ఇందులో భాగంగా మహాశయ్ చున్నీలాల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తన జీతంలో 90శాతానికి పైగా ఈ సంస్థ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో పద్మభూషనణ్ తో సత్కరించింది కేంద్రం. గులాటీ మృతికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.