రెండు కంటెయినర్లు ఢీకొని ఇద్దరు సజీవదహనం

రెండు కంటెయినర్లు ఢీకొని ఇద్దరు సజీవదహనం

మెదక్ (చేగుంట), వెలుగు: హైవే మీద ఆగి ఉన్న కంటెయినర్ ను మరో కంటెయినర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద హైవేపై జరిగింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు టైర్ల లోడుతో వెళ్తున్న కంటెయినర్ టైర్ పగిలిపోవడంతో డ్రైవర్ కాస్లాపూర్ వద్ద రోడ్డు పక్కన ఆపాడు. ఇదే రూట్ లో ఆన్ లైన్ ప్రొడక్ట్స్ తో వెళ్తున్న మరో కంటెయినర్ కాస్లాపూర్ వద్దకు రాగానే అదుపు తప్పి హైవే పక్కన ఆగి ఉన్న వాహనాన్ని  వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగడంతో వెనుక వచ్చిన కంట్‌యినర్ క్యాబిన్ లోని సిలిండర్ పేలింది. 

మంటలు లేచి క్యాబిన్ తో పాటు, ముందున్న కంటెయినర్ లోని టైర్లు అంటుకున్నాయి. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధం కావడంతో కర్నాటకకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు, అందులోనే ఉన్న మరో డ్రైవర్ బస్వరాజ్ సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రామాయంపేట నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు ఆర్పివేశారు. నాగరాజు, బస్వరాజ్ బాడీలు పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగలడంతో సంఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.