
- 89,762 మంది రైతుల నుంచి 3.19 లక్షల టన్నులు కొనుగోలు
మెదక్, వెలుగు: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు టార్గెట్ మించి జరిగింది. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం 3.18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించారు. ఈ మేరకు జిల్లాలోని 21 మండలాల పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొనుగోళ్లు కొంత మందకొడిగా సాగినా ఆ తర్వాత ఊపందుకున్నాయి. మొత్తం 498 కొనుగోలు కేంద్రాలకు గాను 496 చోట్ల కొనుగోళ్లు ముగిశాయి. 80,762 మంది రైతుల నుంచి రూ.742 కోట్ల విలువైన 3,19,983 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కోసం 406 కేంద్రాలను ఏర్పాటు చేయగా 65,758 మంది రైతుల నుంచి 2,57,424 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.597 కోట్లు. సన్న రకం ధాన్యం కొనుగోలు కోసం 92 కేంద్రాలను ఏర్పాటు చేయగా 15,004 మంది రైతుల నుంచి 62,558 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.145 కోట్లు. మొత్తం 3,19,983 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 3,17,539 (99.24 శాతం) టన్నుల ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ పూర్తయింది.
3,15,959 (98.74 శాతం) ట్రక్ షీట్లు జెనరేట్ అయ్యాయి. ఇప్పటి వరకు 3,13,021 టన్నులకు సంబంధించి 79,359 మంది రైతులకు రూ.726 కోట్లు చెల్లించారు. జిల్లాలో 92 కేంద్రాల ద్వారా 15,004 మంది రైతుల నుంచి 62,558 టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేయగా క్వింటాలుకు రూ.500 చొప్పున రైతులకు బోనస్ డబ్బులు రూ.31.28 కోట్లు చెల్లించాల్సి ఉంది.