అమృత్ పథకానికి మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక

అమృత్ పథకానికి మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక
  • 26న ప్రధాని ద్వారా వర్చువల్ గా శంకుస్థాపన

మెదక్​, వెలుగు: అమృత్ భారత్ పథకానికి మెదక్ రైల్వే స్టేషన్ ఎంపికైంది. ఈ నెల 26న ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు 2 వేల మందితో రైల్వే స్టేషన్ వద్ద సభ ఏర్పాటుకు రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఇండియన్​ రైల్వే డిపార్ట్​మెంట్​చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా రాష్ట్రంలో 40  రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.  ఇందులో మెదక్ రైల్వే స్టేషన్ కు చోటు దక్కింది. అమృత్​ పథకం కింద స్టేషన్​ను ఆధునికీకరిస్తారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరుస్తారు. రూ.206 కోట్ల వ్యయంతో మెదక్​ -అక్కన్నపేట మధ్య 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్​ నిర్మించగా.. 2022 సెప్టెంబర్​ 23వ తేదీన మెదక్ రైల్వే స్టేషన్  ప్రారంభమైంది.

 ప్రస్తుతం కాచిగూడ - మెదక్​ మధ్య రోజు రెండు ప్యాసింజర్ రైళ్లు  నడుస్తున్నాయి. రైల్వేర్యాక్​ పాయింట్​ కూడా ఏర్పాటు కావడంతో ఎరువులకు ఇబ్బంది లేకుండా గూడ్స్ ద్వారా  ఎరువుల బస్తాలు వస్తున్నాయి. రిజర్వేషన్ సెంటర్ కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.