
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన ఓ మెడికల్ స్టూడెంట్ ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేసింది.
ఓ సీనియర్ తమను ర్యాగింగ్ చేస్తున్నాడని పలువురు బాధిత విద్యార్థులు కాలేజీలోని అనాటమీ డిపార్ట్ మెంట్ కంప్లైంట్ బాక్స్ లో ఫిర్యాదు లేఖను వేశారు. దానిపై విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ.. 2020 ఎంబీబీఎస్ బ్యాచ్ కు చెందిన సీనియర్ స్టూడెంట్ ను కాలేజీతో పాటు హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది.
10 మంది సస్పెన్షన్ రద్దుకు నో..
గతంలో ర్యాగింగ్ కు పాల్పడి.. ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన 10 మంది స్టూడెంట్ల పేరెంట్స్గురువారం యాంటీ ర్యాగింగ్ కమిటీని కలిశారు. తమ వాళ్లు మరోసారి ర్యాగింగ్ కు పాల్పడరని, సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రాధేయపడ్డారు. అయితే, కమిటీ సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఒప్పుకోలేదు. తెలిసి చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని డీఎంఈ రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఆయా డిపార్ట్ మెంట్ల హెచ్ వోడీలు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.