
హైదరాబాద్, వెలుగు: మొబైల్ ఫోన్లు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కోరింది. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను విధించగా, 2020లో దాన్ని 18 శాతానికి పెంచారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
మొబైల్ ఫోన్లను అత్యవసర వస్తువులుగా పరిగణించాలని, ప్రజల డిజిటల్ కమ్యూనికేషన్ అవసరాలకు ఇవి ఎంతో అవసరమని ఐసీఈఏ పేర్కొంది. జీఎస్టీని తగ్గించడం వల్ల డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రభుత్వ లక్ష్యాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపింది. డిజిటల్ లావాదేవీలను, ఆన్లైన్ విద్యను, ఆర్థిక సేవలను వేగవంతం చేస్తుందని కూడా పేర్కొంది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, అమ్మకాలు, ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది.