రిమ్స్​ డైరెక్టర్​ను సస్పెండ్​ చేయాలె.. లేదంటే ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తం

రిమ్స్​ డైరెక్టర్​ను సస్పెండ్​ చేయాలె..  లేదంటే ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తం
  • ఆయనను పక్కన పెట్టుకుని ఎంక్వైరీ చేసుడేంది ? 
  • కమిటీ తీరుపై రిమ్స్​ మెడికోల ఫైర్​
  • రెండో రోజు డ్యూటీల బహిష్కరణ

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : ఆదిలాబాద్ ​రిమ్స్​లో హౌస్ ​సర్జన్స్​పై దాడి ఘటనను నిరసిస్తూ మెడికోలు తమ ఆందోళన కొనసాగించారు. శుక్రవారం కూడా డ్యూటీలు బహిష్కరించి మెడికల్​కాలేజీ ముందు ధర్నా చేశారు. డీఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ ​నుంచి వచ్చిన విచారణ కమిటీ మెంబర్స్ ​ప్రొఫెసర్ ​శివ ప్రసాద్, వీవీ రావు.. రిమ్స్​లో డైరెక్టర్​ జైసింగ్ రాథోడ్​తో పాటు మెడికోలు, ప్రొఫెసర్లు, డాక్టర్లను ఎంక్వైరీ చేశారు. త్వరలోనే నివేదికను డీఎంఈకి అందజేస్తామని చెప్పారు. మెడికోలు మాత్రం విచారణ పారదర్శకంగా జరగడం లేదని, ఘటనకు సంబంధించినవి కాకుండా ఇతర విషయాలు అడిగారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రిమ్స్ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని విచారిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. డైరెక్టర్​ను సస్పెండ్​చేసి తర్వాత ఎంక్వైరీ చేయాలన్నారు. న్యాయం జరిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని, ప్రస్తుతం అత్యవసర సేవలను కొనసాగిస్తున్నామని, న్యాయం జరగకపోతే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. సాయంత్రం కాలేజీ నుంచి  నుంచి ర్యాలీగా వెళ్లి రిమ్స్​ మెయిన్ ​గేట్​ఎదుట  డైరెక్టర్​ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.