
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్లకు సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. డిజైన్లను సమకూర్చేందుకు ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కన్సల్టెన్సీల నుంచి ఈవోఐ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
ఆ గడువు 15వ తేదీతో ముగిసిపోగా, తాజాగా మరో పదిరోజుల పాటు పొడిగించారు. ఈవోఐకి సంబంధించి ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలతో ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు ఇటీవలే ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగు కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈవోఐ దాఖలుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సమయం సరిపోదని, నిర్దేశిత గడువును మరింత పొడిగించాలని కోరారు.