
- మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం కండ్ల ముందే కనిపిస్తున్నా.. నిర్మాణ సంస్థ బుకాయింపు
- నాడు బ్యారేజీ పనులు పూర్తికాకముందే కంప్లీషన్
- సర్టిఫికెట్ కోసం ఎల్అండ్టీ ఒత్తిళ్లు
- 2019 ఆగస్టు నుంచి ఇరిగేషన్ శాఖకు మూడుసార్లు లేఖ
- అప్పటికే వరదలతో బ్యారేజీకి నష్టం.. రూ.150 కోట్ల పనులూ పెండింగ్
- డ్యామేజీలకు రిపేర్లు చేయాలని, పనులు పూర్తి చేయాలనిఅధికారులు చెప్పినా పట్టించుకోలే
- నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అండర్ టేకింగ్ లేకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకున్న సంస్థ
- అదే ఏడాది జనవరిలోనే రూ.159 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలూ వెనక్కి
- ఇన్ని లోపాలు కనిపిస్తున్నా ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుబట్టడంపై అధికారుల ఆశ్చర్యం
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దాన్ని నిర్మించిన ఎల్అండ్టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్నది. బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోవడం కండ్ల ముందే కనిపిస్తున్నా.. నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్విచారణ, నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తేల్చినా.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ సంస్థ తాపత్రయపడుతున్నది.
ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుబడుతూ తాజాగా ఇరిగేషన్ శాఖకు ఎల్అండ్టీ లేఖ రాయడంపై అధికార వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. బ్యారేజీకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయకపోగా, పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకోవడం, కరోనా పేరు చెప్పి బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇప్పించుకోవడం వంటివన్నీ కనిపిస్తున్నా.. అసలు తమ తప్పేమీ లేదన్నట్టుగా ఎల్అండ్టీ వ్యవహరిస్తున్నదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విభాగమైన ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చి ఇచ్చిన రిపోర్టునే ఓ ప్రైవేట్ సంస్థ వేలెత్తి చూపడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఎల్అండ్టీపై ప్రభుత్వం మొదటి నుంచీ చూసీచూడనట్టు వ్యవహరించడం, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే సంస్థ ఇలా రెచ్చిపోతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోగా.. ఎదురు ఆరోపణలు చేయడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, అనంతరం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఎల్ అండ్టీ సంస్థకు ఈ నెల రెండో వారంలో ఇరిగేషన్శాఖ లేఖ రాసింది. దానికి ఎన్డీఎస్ఏ రిపోర్టును అటాచ్ చేసి పంపించింది. ఆ లేఖకు ఈ నెల 21నే ఎల్అండ్ టీ కూడా రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత మూడ్రోజులకు అంటే ఈ నెల 24న మరో లేఖను రామగుండం ఎస్ఈకి రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో తప్పులు ఉన్నాయని అందులో పేర్కొంది. ‘‘బ్యారేజీ డిజైన్లకు సంబంధించి జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్ను సరిగా చేయలేదని రిపోర్టులో పేర్కొన్నారు. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్సరిగా మోడల్స్టడీస్చేయలేదని చెప్పారు. హైడ్రాలిక్, స్ట్రక్చరల్డిజైన్లలో లోపాలు ఉన్నాయన్నారు.
ఓ అండ్ఎం మాన్యువల్ లేదని, ఓ అండ్ ఎం చేయలేదని పేర్కొన్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించలేదని చెప్పారు. డ్యామ్సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఓ అండ్ఎం పనులు చేపట్టలేదన్నారు. కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడానికి ఎలాంటి సరైన ఆధారాలను చూపించలేదు’’ అని ఎల్అండ్ టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి ఎన్డీఎస్ఏ 2024 మార్చి 21న అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు క్వాలిటీ కంట్రోల్మాన్యువల్, సీకెంట్పైల్స్మెథడ్కు సంబంధించి పాటించిన నాణ్యతా ప్రమాణాలు, క్వాలిటీ చెక్కు సంబంధించిన ఆధారాలు, ప్రతి మూడు నెలలకోసారి డిపార్ట్మెంట్సంతృప్తి చెందుతూ ఇచ్చిన రిపోర్టులు తదితర అందజేశామని గతంలో ఎన్డీఎస్ఏ పేర్కొందని చెప్పింది. కానీ, ఇప్పుడు రిపోర్టులో మాత్రం క్వాలిటీ కంట్రోల్మేనేజ్మెంట్సరిగా నిర్వహించలేదని ఎన్డీఎస్ఏ పేర్కొనడాన్ని తాము తిరస్కరిస్తున్నామని తెలిపింది. రిపోర్టును ఒకసారి రివ్యూ చేయాలని కోరింది. అందుకు అనుగుణంగా రిపోర్టును అప్డేట్ చేయాలని సూచించింది.
కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం ఒత్తిళ్లు..
బ్యారేజీ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ఇవ్వాలంటూ ఇరిగేషన్ శాఖకు ఎల్అండ్టీ మూడుసార్లు లేఖలు రాసింది. 2019 జూన్ 21న నాటి సీఎం కేసీఆర్ బ్యారేజీని ప్రారంభించారు. అప్పటికి అక్కడ కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఆ పనుల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అధికారులే చెబుతున్నారు. కానీ, ఆ పనులను పూర్తి చేయకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ ఈఈకి 2019 ఆగస్టు 6న ఎల్అండ్టీ సంస్థ లేఖ రాసింది. అయితే, బ్యారేజీలో కొన్ని డ్యామేజీలు ఉన్నాయని, వాటి రిపేర్లు పూర్తి చేయాలని అధికారులు 2020లో లేఖ రాశారు. అప్పటికి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఇంకా అమల్లోనే ఉంది. అంటే బ్యారేజీ పూర్త యిన నాటి నుంచి రెండేండ్ల పాటు డిఫెక్ట్లయబిఈలిటీ పీరియడ్ ఉంటుంది.
ఆ టైంలో బ్యారేజీకి ఏవైనా డ్యామేజీ జరిగితే రిపేర్లు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదే. కానీ, రిపేర్లు చేయకపోగా.. 2020 అక్టోబర్12న సంస్థ మరోసారి బ్యారేజీ అధికారులకు లేఖ రాసింది. దానికి బదులుగా ముందు డ్యామేజీలు బాగు చేయాలని, మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని 2021 ఫిబ్రవరి 17న అధికారులు లేఖ రాశారు. ఆ లేఖనూ నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ఆ తర్వాత నెలకే అంటే 2021 మార్చి 10న.. కంప్లీషన్ సర్టిఫికెట్ఇవ్వాలంటూ మరోసారి లేఖ రాస్తూ ఒత్తిడి చేసింది. ఈసారి నిర్మాణ సంస్థ ఒత్తిడి, నాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయంతో.. డ్యామేజీలు బాగు చేసేలా, మిగిలిన పనులు పూర్తి చేసేలా అండర్టేకింగ్తీసుకోవాల్సి ఉన్నా.. అదేమీ తీసుకోకుండానే హడావుడిగా ఐదు రోజులకే 2021 మార్చి 15న నాటి ప్రభుత్వం సంస్థకు కంప్లీషన్సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం.
కాళేశ్వరం చీప్ క్వాలిటీ కాదని ఎల్అండ్టీ లేఖతో తేలిపోయింది: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ చీప్క్వాలిటీ కాదని, బీజేపీ చేస్తున్న రాజకీయాలే చీప్అని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటా సేకరించకుండానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్తయారు చేసిందని, ఆ రిపోర్టును ప్రపంచ ప్రఖ్యాత ఎల్ అండ్టీ సంస్థ తిరస్కరించిందని బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-, బీజేపీ.. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట డ్రామాకు తెరతీశాయన్నారు.
కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ తప్పుల తడక నివేదికతో కాంగ్రెస్, బీజేపీలు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ- దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్చెబుతున్న మాటే అక్షరాలా ఎల్అండ్టీ నిర్ణయంతో ప్రజలకు మరోసారి తెలిసిందన్నారు. కేవలం ఓ నీచమైన ఊహ ఆధారంగా క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్ ను తయారు చేశారని ఆరోపించారు.
ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీయే నివేదిక అని పిలవడంలో తప్పు లేదన్నారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని ఫైర్ అయ్యారు.
ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణం వరకు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కట్టిన కాళేశ్వరంపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా.. వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అయితే కేసీఆర్ దార్శనికుడన్నారు.
ఆ పనులకూ ప్రభుత్వమే ఖర్చు పెట్టుకోవాలట..
కాంట్రాక్ట్ ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో జరిగిన డ్యామేజీలకు నిర్మాణ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటికి సంస్థనే రిపేర్లు చేయించాలి. కానీ, ఇప్పుడు ఎల్అండ్టీ మాత్రం.. వాటి ఖర్చులు ప్రభుత్వమే భరించాలంటూ మెలిక పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లేఖ రాసినట్లు తెలిసింది. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తేదీ నుంచి చూసుకుంటే.. ఓ అండ్ఎం యాక్టివిటీస్ కూడా ఐదేండ్లు సంస్థే చూసుకోవాలి. ఇన్ని అంశాలు ఎల్అండ్టీ వైపు వేలెత్తి చూపిస్తున్నా.. అత్యంత నిపుణులున్న ప్రభుత్వ ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలే తప్పు అని, రిపోర్టును అప్డేట్ చేయాలంటూ ఎల్అండ్టీ లేఖ రాయడమంటే ‘దొంగే.. దొంగా దొంగా ’ అన్నట్లుగా ఉందని సీనియర్ఇంజినీర్లు అభిప్రాయపడ్తున్నారు.
రెండేండ్లు చోద్యం..
బ్యారేజీని ప్రారంభించిన ఏడాదే అందులో లోపాలు బయటపడ్డాయి. బ్యారేజీకి దిగువన, ఎగువన డ్యామేజీలు జరిగాయన్నది అధికా రుల లేఖల ద్వారా స్పష్టంగా అర్థమవుతు న్నది. కానీ, డ్యామేజీలకు రిపేర్లు చేయించా లన్న అధికారుల లేఖలకూ ఎల్అండ్టీ సంస్థ స్పందించలేదు. దాదాపు రెండేండ్ల పాటు చోద్యం చూసిందన్న విమర్శలు ఉన్నాయి. డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్ఉండగా కూడా ఎల్ అండ్టీ కనీసం ఎందుకు స్పందించలేదన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు.. కరోనా పేరిట రూ.159 కోట్ల విలువైన బ్యాంక్గ్యారంటీలనూ సంస్థకు నాటి ప్రభుత్వం విడుదల చేసింది. 2021 జనవరి 23న హడావుడిగా బ్యాంక్ గ్యారంటీలను ఇచ్చేశారు. 2020 నవంబర్13న జరిగిన మీటింగ్లో బ్యాంక్గ్యారంటీలను విడుదల చేసేందుకు అంగీకరించకపోయినా.. ఆ తర్వాత మూడు నెలలకే బీజీలు విడుదలయ్యాయి. దానికి సంబంధించిన అంశాలూ మీటింగ్మినిట్స్లోనూ రికార్డ్ చేయలేదని కాళేశ్వరం కమిషన్ఎంక్వైరీలో అధికారులే బహిరంగంగానే చెప్పారు. ఇక, కంప్లీషన్సర్టిఫికెట్వచ్చిన తేదీ నుంచి ఐదేండ్ల పాటు ఆపరేషన్అండ్మెయింటెనెన్స్ను చేపట్టాల్సి ఉన్నా.. సంస్థ చేపట్టలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.