సర్కార్ స్కీంలు పేదలకు చేరుతున్నయా?..కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్​చార్జీలను ఆరా తీసిన మీనాక్షి నటరాజన్ 

సర్కార్ స్కీంలు పేదలకు చేరుతున్నయా?..కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్​చార్జీలను ఆరా తీసిన మీనాక్షి నటరాజన్ 
  • ఎంపీ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ రాష్ట్ర ఇన్​చార్జీ సమావేశం  
  • ఆరు గ్యారంటీల అమలుపై జనం ఏమంటున్నరు? 
  • స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణ ఏమిటి? 
  • ఇబ్బందులుంటే చెప్పాలి లేదా రాసివ్వాలని సూచన  
  • ఒకేరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ తాజా పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో సుదీర్ఘ రివ్యూలు నిర్వహిస్తున్నారు. బుధవారం హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకంగా 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలతో ఆమె భేటీ అయ్యారు. గురువారం మరికొన్ని నియోజకవర్గాల నేతలతోపాటు పీసీసీ ఇంచార్జీలతోనూ ఆమె రివ్యూ నిర్వహించనున్నారు.

బుధవారం నాటి రివ్యూ సందర్భంగా అనేక అంశాలపై నేతలను అడిగి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు పేదలకు చేరుతున్నాయా? ఆరు గ్యారంటీల అమలుపై జనం ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ సర్కార్ పై ప్రజలు సంతృప్తితోనే ఉన్నారా?” అని ఆరా తీశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజిగిరి, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించారు.

‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిన నేపథ్యంలో సర్కార్ పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగి తెలుసుకున్నారు. ‘‘పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? మీకు పార్టీలో ఏ నేతతో అయినా సమస్యలు ఉన్నాయా? రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి మీ వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటి?” అనే విషయాలపై నేతలతో విడివిడిగా చర్చించారు.  అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే, తనకు లేఖ ద్వారా కూడా పంపించవచ్చని, కానీ వాస్తవాలను మాత్రం తన దృష్టికి తేవాలని సూచించారు.   

పాత, కొత్త నేతల మధ్య గొడవలపైనా ఆరా.. 

పార్టీలో పాత, కొత్త నేతల మధ్య గొడవలపైనా మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు తెలిసింది. ‘‘అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పాత, కొత్త నేతల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఉంటే వాటిని తొలగించడానికి మీరు చేస్తున్న కృషి ఏమిటి? హైకమాండ్ గా తాము ఎలాంటి ప్రయత్నం చేయాలి?’’ అనే విషయాలపైనా ఆమె వివరంగా నేతలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ‘‘ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీరు పార్టీలోని అన్ని స్థాయిల్లోని క్యాడర్ ను కలుపుకొని పోతున్నారా? లేదా? కలుపుకొనిపోతే మరి ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి?’’ అని కూడా ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని ఉద్దేశించి కూడా ఆమె పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

‘‘మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇస్తే గెలిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?’’ అని అడిగినట్లు సమాచారం. అలాగే పార్టీ పరంగా ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? ఒకవేళ ఇస్తే పార్టీని ఎలా బలోపేతం చేస్తారని కూడా ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. రివ్యూ మీటింగ్స్ లో పార్టీ  ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, రోహిత్ రావు, నేతలు మైనంపల్లి హన్మంతరావు, మధు యాష్కీ, కాటా శ్రీనివాస్ గౌడ్, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.