గాంధీభవన్ లో ధర్నా ఎందుకు చేశారు?..సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి నటరాజన్

గాంధీభవన్ లో ధర్నా ఎందుకు చేశారు?..సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి నటరాజన్
  • పార్టీ కోసం కష్టపడ్డవాళ్లకు న్యాయం చేసేందుకే అన్న సునీతారావు
  • తన సొంత ఎజెండా ఏమీ లేదని వివరణ

హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్ లో నిరసన తెలిపిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో  వివరణ కోరారు. ధర్నా చేయడం తమ ఉద్దేశం కాదని, సొంత ఎజెండా కోసం చేయలేదని మీనాక్షి నటరాజన్ కు సునీతారావు వివరించారు. గురువారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ తో సునీతారావు సమావేశమయ్యారు. గాంధీ భవన్  కు మహిళా కాంగ్రెస్ నేతలు వస్తే లోపలికి రాకుండా గేట్లు వేస్తున్నారంటూ సునీతా రావు చెప్పగా.. మీనాక్షి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని ఆమె ఇన్ చార్జ్ కి సూచించారు. పార్టీ అధికారంలో రావడం వెనుక కాంగ్రెస్​ మహిళా నేతల  కృషి ఉందని, వారికి సైతం పదవుల్లో అవకాశం ఇవ్వాలని  కోరగా, తప్పకుండా న్యాయం చేస్తానని మీనాక్షి హామీ ఇచ్చినట్లు సునీతారావు చిట్ చాట్ లో మీడియాకు వెల్లడించారు. పార్టీ కమిటీల్లో మహిళలకు అవకాశం ఇవ్వడం లేదని , పదవులన్నీ నేతల బంధువులకే ఇస్తున్నారని ఆరోపణలు చేస్తూ గాంధీ భవన్ లో ఈ నెల 14న మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేశారు. ఈ ధర్నాపై హై కమాండ్ సీరియస్ అయింది. ఏడు రోజుల్లో  వివరణ ఇవ్వాలని ఏఐసీసీ ద్వారా షోకాజ్ నోటీస్​ జారీ చేసింది. అనంతరం సీఎం రేవంత్​రెడ్డికి, పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ కు  సునీతారావు  క్షమాపణ చెప్పారు.