రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో…బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో తన వంతు సాయంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ డొనేట్ చేశారు. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంకులో ఆయన రక్తదానం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజలు అభిమానులు విరివిగా రక్తదానం చేయాలని అందుకు సమీప బ్లడ్ బ్యాంక్స్ కి వెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు .
అంతేకాదు లాక్ డౌన్ ఉన్నా రక్తదానం చేయొద్దని ఎవరూ ఆపరని.. పోలీసులతో ఏ ఇబ్బందీ రాదన్నారు. రక్తదానం చేస్తున్నాం అని తెలపగానే బ్లడ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్ కు పాస్ వస్తుంది. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుందని తెలిపారు చిరంజీవి.
రక్త దానం చేసిన చిరంజీవి…కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పాటించారు. ఆయన తో పాటు హీరో శ్రీకాంత్- రోషన్, శ్రీమిత్ర చౌదరి.. వారి వారసులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెనర్జీ, నటుడు భూపాల్, గోవిందరావు, విజయ్, సురేష్ కొండేటి తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు
ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం చిరంజీవి కోటి రూపాయల విరాళం ఇచ్చారు.