సుంకిశాల ప్రాజెక్టుతో నష్టం తప్ప.. లాభం లేదు : అప్పట్లోనే తేల్చిన తాతారావు కమిటీ

సుంకిశాల ప్రాజెక్టుతో నష్టం తప్ప.. లాభం లేదు : అప్పట్లోనే తేల్చిన తాతారావు కమిటీ

నల్గొండ, వెలుగు: హైదరాబాద్​ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మెట్రోవాటర్​ స్కీం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఎస్ఎల్​బీసీ (శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​ కెనాల్) నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్​కు వాటర్​ తీసుకునే అవకాశం ఉండగా, సుంకిశాల దండగ అని అప్పట్లో కాంగ్రెస్​ నేతలతో పాటు బీఆర్ఎస్​ నేతలూ విమర్శించారు. 

సుంకిశాలతో నష్టమే.. 

ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్​ రెడ్డి టైంలోనే సుంకిశాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో పెద్ద పోరాటం జరిగింది. జిల్లాలో అప్పుడున్న కమ్యూనిస్టులు, టీడీపీ నేతలు సుంకిశాల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో అప్పటి ప్రభుత్వం నార్ల తాతారావు ఆధ్వర్యంలో టెక్నికల్​ కమిటీని నియమించగా, ఆ కమిటీ సుంకిశాల వల్ల లాభం లేదని తేల్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా నాటి ప్రభుత్వాలు కొత్తగా ఏఎమ్మార్పీ(ఎలిమినేటి మాధవరెడ్డి) ని ప్రతిపాదించడంతో పాటు ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని నిర్ణయించాయి. కానీ తెలంగాణ వచ్చాక ఎస్​ఎల్​బీసీని నిర్లక్ష్యం చేసిన గత  కేసీఆర్​ సర్కారు.. 

హైదరాబాద్​ తాగునీటి అవసరాల పేరుతో సుంకిశాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్​​డెడ్​స్టోరేజీకి చేరుకున్నా, హైదరాబాద్​ సిటీకి తాగునీటి సమస్య రావొద్దనే ఉద్దేశ్యంతో సుంకిశాల నిర్మిస్తున్నట్టు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చెప్పింది. దీనిని అప్పట్లో కాంగ్రెస్​ నేతలతోపాటు నల్గొండకు చెందిన బీఆర్ఎస్​ నేతలు కూడా వ్యతిరేకించారు. పైన ఎస్ఎల్​బీసీ నుంచి  గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చుకునే అవకాశం ఉండగా, మోటర్లతో ఎత్తిపోసుకోవడం ఏమిటని విమర్శించారు. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. 

కానీ బీఆర్ఎస్​ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. 2021లో రూ.2,200 కోట్ల అంచనాలతో మేఘా కాంట్రాక్ట్​ సంస్థ ఈ వర్క్స్​దక్కించుకొని వెయ్యి కోట్ల విలువైన పనులు చేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్​బీసీని పూర్తిచేయడంపై ఫోకస్​పెట్టింది. నిజానికి  సుంకిశాలకు మరో రూ.1,200 కోట్లు పెట్టి పూర్తిచేసినా.. కరెంట్​బిల్లుల కోసం ప్రతి నెలా రూ.13 కోట్లు పెట్టాల్సిందేనని, దీని వల్ల నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్​ నేతలు వాదిస్తున్నారు. దీంతో సుంకిశాల పరిస్థితి ఏమిటో అంతుచిక్కడం లేదు.