న్యూఢిల్లీ: అమెరికా సెమీకండక్టర్ కంపెనీ మైక్రాన్ మన దేశంలో 3 బిలియన్ డాలర్లతో పెట్టనున్న సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) యూనిట్కు ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఈ కంపెనీ తొలి దశలో 2.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. రాబోయే అయిదేళ్లలో ఆ పెట్టుబడులను పెంచాలని ప్లాన్చేస్తోందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దేశంలో సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్కు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం రూ. 76 వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రాన్ సీనియర్ అధికారులు మన ప్రభుత్వ అధికారుల మధ్య చాలా దఫాలు చర్చలు జరిగాయి.
పెట్టుబడుల ప్లాన్, యూనిట్ కెపాసిటీ ఎంతో చెప్పాలని, తమ నుంచి ఏం కోరుకుంటోందో కూడా వెల్లడించాలని మైక్రాన్ను కోరామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎస్ఏటీ యూనిట్లు అనేవి సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ చెయిన్లో చాలా ముఖ్యమైన లింక్. సిలికాన్ చిప్స్ టెస్టింగ్, ప్యాకింగ్ వంటి కీలకమైన టాస్క్లను ఈ ఓఎస్ఏటీలు నిర్వహిస్తాయి. సెమీకండక్టర్ యూనిట్ పెట్టడానికి 10 నుంచి 15 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడి అవసరమైతే, ఈ ఓఎస్ఏటీ పెట్టడానికి 5 బిలియన్ డాలర్లు సరిపోతుంది. మైక్రాన్ ప్రపోజల్స్ ఇంచుమించుగా నచ్చాయని, అనుమతి ఇవ్వడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్లో 1978 లో ఏర్పాటయిన మైక్రాన్కు ఇండియాలో ఇప్పటికే బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో రెండు ఆఫీసులున్నాయి.
