
- పగ్గాలు చేపట్టిన జనరల్ బుర్హాన్
- నిరసనగా వీధుల్లోకి వెల్లువెత్తిన జనం
కైరో: ప్రజాస్వామిక పాలన వైపు రెండేళ్లుగా సూడాన్ వేస్తున్న అడుగులకు బ్రేక్ పడింది. జనరల్ అబ్దెల్ ఫతా బుర్హాన్ సోమవారం సైనిక తిరుగుబాటుకు తెర తీశారు. తాత్కాలిక ప్రధాని అబ్దల్లా హందోక్ దంపతులతో పాటు సీనియర్ మంత్రులు తదితరులను అరెస్టు చేయించి గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించారు. సైనిక, పౌర నేతలతో కూడిన పాలక కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి టీవీలో ప్రసంగించారు. పాలక కూటమిలో తలెత్తిన విభేదాల వల్లే సైన్యం జోక్యం చేసుకోవాల్సి వస్తోందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. ప్రజాస్వామిక పాలన దిశగా సాగుతున్న ప్రక్రియను ముందుకు తీసుకుపోతానని ప్రకటించుకున్నారు. త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఈ సైనిక తిరుగుబాటుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధాని ఖార్తోమ్, దాని జంట నగరం ఓండుర్మాన్ వీధుల్లోకి వేలాదిగా దూసుకొచ్చి ప్రదర్శనలకు దిగు తున్నారు. భద్రతా దళాలతో జరిగిన ఘర్షణల్లో 12మంది దాకా గాయపడ్డారు. నిరసన జ్వాలలను అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేయించారు. సూడాన్ పరిణామాలపై అమెరికా, ఈయూ విచారం వెలిబుచ్చాయి. ప్రధానిని, మంత్రులను తక్షణం విడుదల చేయాలని ఆఫ్రికయన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.