- టైమ్కు ఇవ్వక సివిల్ సప్లయ్స్పై వడ్డీల భారం
- ఇప్పటికే రూ.56 వేల కోట్లు బాకీ
- సర్కారు సొమ్ముతో మిల్లర్ల వ్యాపారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మిల్లర్లు కస్టమ్మిల్లింగ్రైస్(సీఎంఆర్) విషయంలో ప్రతీ ఏటా తీవ్ర జాప్యం చేస్తున్నారు. గత వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ఈ నెలాఖరు వరకే ఇవ్వాల్సి ఉండగా.. ఇంకా 81.68 శాతం పెండింగ్లోనే ఉంది. సర్కారు వేలకోట్లు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి ఇస్తే.. మిల్లర్లు నెలలు తరబడి పెండింగ్పెడుతూ ఇచ్చినప్పుడే తీసుకోవాలన్నట్టు వ్యవహరిస్తున్నారు.
.దీంతో సివిల్సప్లయ్స్సంస్థపై వడ్డీల భారం పడుతోంది. ఇప్పటికే రూ.56వేల కోట్లు బాకీ పడింది. నికరంగా రూ.11,500 కోట్లు అప్పుల్లో కూరుకుపోయింది. మిల్లర్లు మాత్రం మిల్లింగ్జాప్యంపై అనేక కారణాలు చెప్తూ గడువును వాయిదా వేయించుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. కొత్త సర్కారు వచ్చిన నాటి నుంచి పెండింగ్ సీఎంఆర్ ను రాబట్టడానికి కఠినంగా వ్యవహరిస్తున్నా.. గడువులోగా పూర్తయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
క్వింటాల్ బియ్యం కూడా ఇవ్వని కొందరు మిల్లర్లు
గత వానాకాలం సీజన్ లో 47.34 లక్షల టన్నుల వడ్లను సివిల్సప్లయ్స్ డిపార్ట్మెంట్సేకరించి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు క్వింటాల్ వడ్లు మిల్లింగ్ చేసి 67 కిలోల బియ్యం సీఎంఆర్ రూపంలో ఎఫ్సీఐకి అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 31.76 లక్షల టన్నుల సీఎంఆర్ను ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు కేవలం 5.82 లక్షల టన్నులు(18.32%) మాత్రమే మిల్లర్లు అందించారు. ఇంకా 25.94 లక్షల టన్నులు(81.68%) పెండింగ్లోనే ఉంది. కొందరు మిల్లర్లు కనీసం క్వింటాల్ బియ్యం కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ సేకరణ జరిగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో ఒక్క బియ్యం గింజ కూడా ఇవ్వలేదు. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కనీసం 20 శాతం కూడా పూర్తి చేయలేదు.
నిరుడు యాసంగి సీఆర్ఎం ఇంకా కొంత పెండింగ్
నిరుడు యాసంగిలో సర్కారు 66.84 లక్షల టన్నుల వడ్లు సేకరించి.. 35 లక్షల టన్నులు టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టింది. మిగిలిన వడ్లు మిల్లింగ్చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 19.19 లక్షల టన్నులు సీఎంఆర్ రూపంలో మిల్లర్లు అందించారు. ఇందులో బాయిల్డ్ రైస్ 14.81లక్షల టన్నులు ఇవ్వగా.. రా రైస్ మాత్రం కేవలం 4.01 లక్షల టన్నులే ఇచ్చారు. ఇంకా పెండింగ్లో ఉన్న సీఎంఆర్లో 25.90 లక్షల టన్నుల్లో 23.62 లక్షల సీఎంఆర్కు సంబంధించిన వడ్లు సర్కారు టెండర్లలో అమ్ముకుంది. దీంతో నిరుడు యాసంగికి సంబంధించి ఇంకా 2.28 లక్షల టన్నులుపెండింగ్లో ఉంది. అయితే, అవి మిల్లర్ల వద్ద ఉన్నాయా? అమ్ముకున్నారా? అనేది తేలాల్సి ఉంది.
సర్కారు వడ్లతో మిల్లర్ల బిజినెస్
రాష్ట్రంలో ఉన్న మిల్లర్లలో చాలా వరకు వడ్లు మిల్లింగ్చేసి సర్కారుకు టైమ్కు ఇవ్వకుండా గోల్మాల్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కారు నుంచి రూ.97,511.76 కోట్ల విలువైన వడ్లు తీసుకొని.. గడువులోగా మిల్లింగ్చేసి ఇవ్వకుండా అక్రమంగా బయటి మార్కెట్లో అమ్ముకుంటూ సర్కారు సొమ్ముతో బిజినెస్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటుంటే.. మరికొందరు ఏకంగా విదేశాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకుని.. తక్కువ ధరకు వచ్చిన బియ్యం ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారని సమాచారం. దీంతో ఆ బియ్యం పురుగు పడుతున్నట్టు తెలిసింది. దీనిపై ఇటీవల ఎఫ్సీఐ చెన్నై రీజనల్ కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఆరుగురు మేనేజర్లు, 16 మంది టెక్నికల్అసిస్టెంట్లను ఈ సీజన్అయ్యే వరకు ప్రొక్యూర్మెంట్విధుల్లోంచి తొలగించారు.