నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీతో ఆమె మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు కలెక్టరేట్లో కలెక్టర్ 7 వ చిన్న తరహా సాగునీటి వనరుల గణన, 2 వ జలాశయాల గణన పై ముఖ్య ప్రణాళిక అధికారి, సంబంధిత అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి భద్రతను మెరుగుపరిచి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సహకరించే 7 వ చిన్న తరహా నీటి వనరుల గణన, 2 వ జలాశయాల గణన కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కోరారు.అంతకుముందు బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్లో నిర్వహించిన జవహార్లాల్ నెహ్రూ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలనపై దిశానిర్దేశం చేశారు.
ఆ తర్వాత నల్లగొండ మండలంలోని దోమలపల్లికి చెందిన తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే దేశగాని నర్సింహ మృతి చెందడంతో కలెక్టర్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున రావాల్సిన బెనిఫిట్స్ను త్వరగా వచ్చేలా చూస్తామని, కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగావకాశం కల్పిస్తామని తెలిపారు.
