నిజామాబాద్ అర్బన్, బోధన్​ అసెంబ్లీ స్థానాలపై మజ్లిస్ ఫోకస్

నిజామాబాద్ అర్బన్,  బోధన్​  అసెంబ్లీ స్థానాలపై మజ్లిస్  ఫోకస్
  •     అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు
  •     ఆయా నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్​ఉందని లెక్కలు
  •     పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీకి ప్రతిపాదన

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని అర్బన్, బోధన్​ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడంపై మజ్లిస్ ​పార్టీ ఫోకస్ ​పెట్టింది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని పార్టీ అధినేత అసదుద్దీన్​ఓవైసీకి విన్నవించేందుకు జిల్లా నేతలు రెడీ అయ్యారు. మిత్రపక్షంగా భావించే ఎంఐఎమ్​ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం అధికార బీఆర్ఎస్​లో చర్చకు దారితీసింది.


2014 తరహా వెళ్లాలని..


నిజామాబాద్​ అర్బన్ నియోజకవర్గంపై ఎంఐఎం​కు పట్టు ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్​లో మజ్లిస్​తరఫున పోటీచేసిన మీర్​మజాస్ ​అలీ షేక్​31,840 ఓట్లు సాధించి, సెకండ్ ప్లేస్​లో నిలిచారు. 2019 నగర పాలక ఎన్నికల్లోనూ 16 డివిజన్లలో విజయం సాధించి, బీఆర్ఎస్​ సపోర్ట్​తో డిప్యూటీ మేయర్​పదవిని దక్కించుకున్నారు. 
నియోజకవర్గంలో పార్టీని మరింత విస్తరించడానికి అసెంబ్లీకి పోటీ చేయాలని లీడర్లు లెక్కలు వేస్తున్నారు. అర్బన్​ ఎమ్మెల్యే గణేశ్​ గుప్తాతో ఎంఐఎం లీడర్లకు చాలాకాలంగా గ్యాప్​ ఉండడం కూడా ప్రతిపాదనకు మరో కారణం. పార్టీ జిల్లా ఇన్​చార్జి మహ్మద్​ షకీల్ ​అహ్మద్​ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన మజ్లిస్ ​లీడర్లు అర్బన్​లో పోటీ చేయాలని తీర్మానించారు. 

బోధన్​లో చెడిన స్నేహం..

1994లో బోధన్​ బల్దియా చైర్మన్​ పదవికి  జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మజ్లిస్ ​నేత మహ్మద్​ ఇబ్రహీం ఎన్నికై, అయిదేండ్లు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తన ప్రభావాన్ని చూపింది. ప్రస్తుత పాలకవర్గంలో 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన షకీల్​ ఆమేర్​కు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. ఏడాది నుంచి ఎమ్మెల్యే షకీల్,​ మజ్లిస్ ​నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. 

ఎంఐఎం పార్టీ నేతలు తనపై దాడి చేశారని కొన్ని నెలల కింద ఎమ్మెల్యే షకీల్​ పోలీసులకు  ఫిర్యాదు చేయగా, పలువురిని అదుపులో తీసుకున్నారు. జైలుకు వెళ్లిన వారిని  కలిసేందుకు నిజామాబాద్ ​వచ్చిన అసదుద్దీన్,​ వచ్చే ఎన్నికల్లో షకీల్​కు బుద్ధి చెబుతామని ప్రకటించారు. ఇప్పుడదే విషయాన్ని ఓవైసీకి గుర్తు చేసి, పోటీకి ఒప్పించాలని స్థానిక లీడర్లు నిర్ణయించారు. బోధన్​ అభ్యర్థిగా మున్సిపల్​ చైర్​పర్సన్​ పద్మ భర్త శరత్​రెడ్డి పేరును ప్రతిపాదించాలని స్కెచ్​ వేశారు.