పాలకుర్తి: కేంద్రం వడ్లు కొనేవరకు విడిచిపెట్టేదిలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నియోకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో రైతులు, కార్యకర్తలతో నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాలతో పబ్బం గడుపుతోందన్నారు.
కేంద్రం వివక్ష చూపుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అన్ని విధాల సహకరిస్తూ తెలంగాణను మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ర్ట ప్రజలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను గుర్రాలతో తొక్కించిన నీచమైన చరిత్ర బీజేపీదని విమర్శించారు. కేంద్రం వడ్లు కొనేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...