గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నా: గంగుల కమలాకర్

గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నా: గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: భవిష్యత్ తరాలకు గొప్ప సిటీని అందించడమే తన లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అని, గెలిచిన తర్వాత అందరూ తన  ప్రజలేనన్నారు. సిటీలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి పలు డివిజన్లలో పర్యటించారు. సీఎంఏ ఫండ్స్ రూ.133.84 కోట్లతో వివిధ డివిజన్లలో చేపట్టిన పనులకు భూమిపూజ చేశారు. 

మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలను నమ్మి అధికారమిస్తే మళ్లీ తెలంగాణ వెనుకబడుతుందన్నారు.  మళ్లీ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే భావితరాల భవిష్యత్ బాగుండేలా అభివృద్ధి చేస్తానన్నారు. డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు మాధవి , వనజా,  భూమాగౌడ్, భాగ్యలక్ష్మి, మహేశ్‌‌‌‌, జయశ్రీ, జయలక్ష్మి పాల్గొన్నారు. 

ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి మూడెకరాలు

కరీంనగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ ఆలయ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి గంగుల పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నేటితరంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకే సిటీలో టీటీడీ ఆలయంతోపాటు ఇస్కాన్ ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. 7న 10 వేల మందితో సిటీలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

మహాత్ముడికి గంగుల నివాళి 

కరీంనగర్ సిటీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్ఖానాగడ్డ, కోతి రాంపూర్ వద్దనున్న గాంధీ విగ్రహాలకు మంత్రి గంగుల, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు  నివాళులర్పించారు.