హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు వల్లె వేస్తోందని, పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని కేంద్రం డ్రామాలాడుతోందన్నారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పార్లమెంట్లో చెప్పడం బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందన్నారు. అయినా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీశ్ అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు.
— Harish Rao Thanneeru (@trsharish) March 25, 2022
మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుండి రాలేదని అసత్యాలు చెప్పగా, నేడు మెడికల్ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మరోసారి అబద్ధాలు చెప్పారు. ఇది చాలా దారుణం, బాధాకరం. pic.twitter.com/yebLPk6nAC