కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే భూముల రేట్లు పెరిగినై : హరీష్ రావు 

కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే భూముల రేట్లు పెరిగినై : హరీష్ రావు 

సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర సాగునీరు ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించి.. గోదావరి జలాలను జహీరాబాద్ కు తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే వల్లే భూముల రేట్లు భారీగా పెరిగాయని చెప్పారు. కేసీఆర్ సర్కార్.. అన్ని వర్గాలదని అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొన్నారు. 

హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దిగ్వాల్ లోనూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామని మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్  హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా..? అని ప్రశ్నించారు. అప్పట్లో ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తామని చెప్పారు. 5 కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్  రూమ్ ఇండ్లను కోహీర్ లో నిర్మించామని తెలిపారు. రూ.150 కోట్ల నిధులతో జహీరాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కోహిర్ లో రూ.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు డయాలసిస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొందన్నారు. 

సర్కారు దవాఖానాల్లో నిర్వహిస్తున్న ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసి, వారికి అండగా ఉంటామన్నారు. దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ర్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. 

ఓపీ బ్లాక్ ప్రారంభం

జహీరాబాద్ దిగ్వాల్ PHCలో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ, ఏఎన్ఎంలతో కాసేపు మాట్లాడారు. గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 86 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని ఏఎన్ఎం, ఆశా వర్కర్లను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే ఆశ, ఏఎన్ఎంలపై పని భారం పడుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు.