
రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. జహీరాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్.. కాంగ్రెస్ నోటి కాడ బుక్కను ఎత్తగొట్టిందని మండిపడ్డారు. ఈసీ రైతుబంధుకు క్లియరెన్స్ ఇవ్వడంతో న్యాయం, ధర్మం గెలించిందన్నాను.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో రైతుబంధును ఈసీ మళ్లీ ఆపిందని హరీశ్రావు అన్నారు.
ఎన్ని రోజలు ఆపుతారు.. డిసెంబర్ 03 తరువాత మళ్లీ రైతుల ఖాతాల్లో టింగు టింగు అంటూ రైతుబంధు డబ్బులు పడతాయంటూ తెలిపారు . రైతులతో తమకున్నది ఓటు బంధం కాదన్న హరీష్,. పేగు బంధమని చెప్పారు. రైతుబంధు మీద కాంగ్రెస్ చేసి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.
నవంబర్28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది.