ఆలయాలను అభివృద్ధి చేస్తున్నం: మంత్రి హరీశ్ రావు

ఆలయాలను అభివృద్ధి చేస్తున్నం: మంత్రి హరీశ్ రావు

కంది, సదాశివపేట, రాయికోడ్, వెలుగు:  ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని వందల ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ మండలం రాఘవపూర్​, హుమ్నాపూర్​ శివారులోని మంజీరాలో నిర్వహిస్తున్న గరుడ గంగా కుంభమేళాలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి కాశీనాథ్​ బాబా, ఎంపీ  బీబీపాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్​రావు, భూపాల్​ రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌తో కలిసి కుంభ కలషాన్ని నదిలో కలిపి పూజలు చేశారు. అనంతరం గంగమ్మకు హారతి ఇచ్చి పంచవటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.  

అనంతరం మండలంలోని కాకిజన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు  సదాశివపేట మండలం రేజింతల్​ శివారు, సిద్దాపూర్​ రోడ్డులో  నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్ ఇండ్లను 500 మంది  లబ్ధిదారులకు  అందజేశారు.  అలాగే  కంది మండలం కాశీపూర్‌‌లో  వీర శైవ లింగాయత్ భవన (బసవ భవన్) నిర్మాణానికి  భూమి పూజ చేశారు. అనంతరం ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్​లో మంత్రి మాట్లాడుతూ బసవేశ్వరుని భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు  చేస్తున్నట్లు ప్రకటించారు. బసవేశ్వరుడు 12 శతాబ్ధంలోనే  కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ శరత్, అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ మంజూశ్రీ, ఆర్డీవో మెంచు నగేశ్​,  హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్‌ చైర్మన్ శివకుమార్  తదితరులు పాల్గొన్నారు. 

మా భూమి అన్యాయంగా లాక్కున్నరు..  

కాశీపూర్​ గ్రామంలో వీరశైవ లింగాయత్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థలం తమదని కొందరు బాధితులు ఆరోపించారు.  మంత్రికి విన్నవించడానికి ప్రయత్నించగా  పోలీసులు అడ్డుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి ఆ భూమిలో పంటలు పండించుకుంటున్నామని, అన్యాయంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.