
- ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలె: మంత్రి హరీశ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలదాకా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా సిబ్బంది వ్యాక్సిన్లు వేస్తారని చెప్పారు. ఆ తర్వాత రెండ్రోజులు సోమ, మంగళవారం.. సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా టీకా వేసుకోనోళ్లుంటే గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. మొత్తం 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.