
- మంత్రి హరీశ్రావుకు ఎంపీ అర్వింద్ హెచ్చరిక
- పదవి కాపాడుకునేందుకు విమర్శలు చేస్తున్నారు
- ఆయుష్మాన్ భారత్లో ముందే ఎందుకు చేరలేదని నిలదీత
నిజామాబాద్, వెలుగు: పదవిని కాపాడుకునేందుకే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. తెలుగు ఇంటి మన సోదరి నిర్మలా సీతారామన్పై పిచ్చికూతలు కూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్లో చేరలేదని నిరూపిస్తే రాజీ నామా చేస్తానన్న హరీశ్ వ్యాఖ్యలపై అర్వింద్ స్పందిస్తూ.. ‘‘ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు పెట్టినవ్? కొవిడ్లో లక్షల మంది చనిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే.. కరోనాతో ట్రీట్మెంట్కు లక్షల మంది అప్పులపాలైతే పెట్టలే.. నిన్నగాక మొన్న హుజూరాబాద్లో టీఆర్ఎస్ను ఓడగొడితే అప్పు డు ఆయుష్మాన్ భారత్ పెట్టిన్రు. అంతకు ముందు ఎందుకు పెట్టలే?” అని నిలదీశారు. ‘‘నీవు రాజీనా మా చేస్తే ఎంత.. చేయకపోతే ఎంత? మరో 9నెలల్లో ఎన్నికలొస్తున్నయ్. మీ ప్రభుత్వం ఉండదు” అని అన్నారు. నిజామాబాద్లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘‘ఇందూరు జనతా కో జవాబ్ దో’’ సభ ను నిర్వహించారు. సభలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. ప్రజలు చావుదెబ్బ కొట్టిన తర్వాతే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరిందని, కరోనా కన్నా ముందే చేరితే రాష్ట్రంలో కరోనాతో వేల మంది ప్రా ణాలు పోయేవి కావన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలకు కల్వకుంట్ల ఫ్యామిలీ బాధ్యత వహించాలన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ల పేర్లు మార్చలేదని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనాలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపాడారని, అలాంటి తెలుగింటి సోదరిపై తప్పు డు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
రేషన్ వివరాలు అడిగితే తప్పేముంది?
రేషన్ వివరాలు కలెక్టర్ను నిర్మలా సీతారామన్ అడిగితే తప్పేముందని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. వివరాలు బయటపడితే బండారం బయటపడుతుందని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్ గా నిలుస్తున్నదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఉన్న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ ఎదుర్కొవాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ మంత్రి అని, కేసీఆర్హామీలకు గంగిరెద్దులా తల ఊపారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన హామీలను పూర్తి చేయించే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డిదే అని అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద జోకరని, టీఆర్ఎస్ నేతలంతా ఆయన వారసులని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ మత్తులో తూగుతున్నారని విమర్శించారు. తాను పసుపు బోర్డు హామీ ఇచ్చి స్పైసెస్ బోర్డు తెచ్చానని, రూ. 30 కోట్ల నిధులు తీసుకువచ్చానని అర్వింద్ తెలిపారు. గత రెండు ఎన్నికల్లో జిల్లాకు టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సభలో మాజీ పోలీస్ అధికారి కృష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు అన్నపూర్ణమ్మ, ధన్పాల్ సూర్య నారాయణ, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, డా. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి , దినేశ్ కులాచారి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.