- రెడీ చేయాలని అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆలయ భూములకు దేవుడే యజమాని అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన క్రమంలో ఆ భూములపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో దేవుని పేరు మీద కొత్త పాస్ బుక్ లు తీసుకోవాలని సూచించారు. ధరణి వెబ్ సైట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితాలో ఆలయ భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలన్నారు. శనివారం బొగ్గులకుంటలో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ.. లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ భూములుకబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రివ్యూలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇన్ చార్జి అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్లు, సహాయక కమిషనర్లు, ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అటవీ అమరవీరులకు నివాళి
అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శనివారం ఆయన అమరులకు నివాళులర్పించారు. జూపార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.
కబ్జాకు గురైన 2,622 ఎకరాలు స్వాధీనం
రాష్ర్టవ్యాప్తంగా కబ్జాకు గురైన దేవాదాయ శాఖకు చెందిన 2,622 ఎకరాల భూములను స్పెషల్ డ్రైవ్ ల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. నాలుగు సార్లు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో మహబూబ్ నగర్ జిల్లాలో 1,040 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 502 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 223 ఎకరాలు, ఖమ్మం జిల్లాల్లో 298 ఎకరాలకు, కరీంనగర్ జిల్లాలో 186 ఎకరాలకు పైగా ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అధికారులు నివేదిక అందచేశారు. అన్ని జిల్లాల అధికారులు ఉత్సాహంతో పని చేయాలన్నారు.