రేవంత్​ కాంగ్రెస్​కే పిండం పెడ్తడు: మంత్రి జగదీశ్రెడ్డి

రేవంత్​ కాంగ్రెస్​కే పిండం పెడ్తడు: మంత్రి జగదీశ్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కాంగ్రెస్​కే పిండం పెడ్తాడని మంత్రి జగదీశ్​రెడ్డి విమర్శించారు. ఉచిత కరెంట్​పై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్​కు తద్దినం పెట్టాడన్నారు. ప్రజలకు పిండాలు పెట్టి హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆరోపించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్​కు పిండం పెడ్తానని అనుడేందని రేవంత్​పై మంత్రి మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్​ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు నిరంజన్​రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్​గౌడ్​ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రేవంత్​పిండం పెట్టాలనుకుంటున్నది సీఎం కేసీఆర్​కు కాదని, తెలంగాణకు అని అన్నారు. రేవంత్​ఇప్పటికీ తెలంగాణ ద్రోహుల చేతుల్లోనే ఉన్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి చిల్లర మాటలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్​ రాజకీయంగా కక్షగట్టి  ఉంటే రేవంత్​ రోడ్లమీద తిరిగేవాడా అని అన్నారు. తెలంగాణ సమాజానికి రేవంత్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్​కే కాదు చంద్రబాబుకు కూడా కేసీఆర్​ ప్రగతి భవన్​లో ఆతిథ్యం ఇచ్చారని గుర్తుచేశారు. గద్దర్​ మృతిపై తాము రాజకీయాలు చేయలేదన్నారు.


రాజకీయ సన్యాసం అని మాట తప్పిండు: నిరంజన్​రెడ్డి
అంపశయ్య మీదున్న కాంగ్రెస్​కు బతికున్నప్పుడే పిండం పెట్టేది రేవంత్​రెడ్డేనని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్​మెయిల్​చేయడం రేవంత్​కు అలవాటేనని మంత్రి సత్యవతి రాథోడ్​అన్నారు. తాను తెలంగాణ వాదినని పదే పదే చెప్పుకుంటున్న రేవంత్​ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఒక్క మంచి పని అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. గద్దర్​ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా అసెంబ్లీ, కౌన్సిల్​లో సంతాపం తెలిపామన్నారు. కేసీఆర్​తో రేవంత్​ పోల్చుకోవడం అంటే నక్కకు నాగలోకానికి పోలిక పెట్టడమేనని మంత్రి శ్రీనివాస్​గౌడ్​అన్నారు.