న్యూఢిల్లీ, పణజి: ఖతార్ లో మరణశిక్ష పడిన మనోళ్లను విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు. భారత నేవీలో పనిచేసి, రిటైరయ్యాక ఎనిమిది మంది ఖతార్ సంస్థలో చేరారు. అయితే, గూఢచర్యం ఆరోపణలతో వారిని ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాలను జై శంకర్ పరామర్శించారు. వారికి భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
మీ ఆందోళనను, బాధలను పూర్తిగా పంచుకుంగామని వారిని ఓదార్చారు.‘‘ఖతార్లో నిర్బంధించిన ఎనిమిది మంది ఇండియన్ మాజీ నేవి సిబ్బంది కుటుంబాలతో ఈ ఉదయం సమావేశమయ్యాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. బాధిత కుటుంబాల ఆందోళనలు, బాధలను దేశమంతా పంచుకోవాలి” అని జైశంకర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నం: అడ్మిరల్ కుమార్
ఖతార్లో కోర్టులో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ నేవి సిబ్బందికి రిలీఫ్కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. సోమవారం పణజిలో ఇండియన్ నేవి నిర్వహించిన గోవా మారిటైమ్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖతార్ కోర్టు తీర్పును దిగ్భ్రాంతికరమైన చర్యగా పేర్కొన్నారు. వారి రిలీఫ్ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు.