మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది రూ.31 కోట్లే: జూపల్లి

మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది రూ.31 కోట్లే: జూపల్లి
  • అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినయ్
  • మరో12 కోట్లకు కమిట్మెంట్స్​ ఉన్నయ్: మంత్రి జూపల్లి
  • రూ.200 కోట్లు ఖ‌‌ర్చు చేశార‌‌న్నది త‌‌ప్పుడు ప్రచారం
  • మిస్ ఇంగ్లండ్ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.31 కోట్లే అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చాయని, మరో రూ.12 కోట్లకు కమిట్మెంట్లు ఉన్నాయని తెలిపారు. అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు సున్నా అవుతుందని అన్నారు. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.సెక్రటేరియెట్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి జూపల్లి కృష్ణారావు మంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. తాము చాలా తక్కువ ఖర్చుతో మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకం, హస్త కళలు, చేనేత ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేశామని తెలిపారు. ‘‘హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు సక్సెస్ అయ్యాయి.  వేడుకల నిర్వహణ, ఆతిథ్యంపై కంటెస్టెంట్లు, మిస్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రల్డ్ ఆర్గనైజేషన్, మీడియా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు’’అని జూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వెల్లడించారు.

కేటీఆర్, హరీశ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు

మిస్ వరల్డ్ పోటీలు విజయంతం చేసినందుకు ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేస్తున్నాయని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ‘పోటీలపై  విపక్షాల విమర్శలు చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థం కావడం లేదు.  మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఎలా ఖర్చు అయ్యాయో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావే చెప్పాలి. తెలంగాణ భవన్ కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? రూ.200 కోట్లు ఖర్చయినట్లు నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలి. వారం రోజులు టైమ్ ఇస్తున్న’’అని జూపల్లి అన్నారు.  

30 తులాలు కాదు, 3 గ్రాములు కూడా ఇయ్యలే..

సొంత పత్రికలు, మీడియా, సోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మీడియాలో అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్యాలు ప్రసారం చేశార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, అందగత్తెల కాళ్లు కడిగినట్లు చూపించారని మంత్రి జూపల్లి మండిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డారు. ‘‘రామప్పలో సంప్రదాయం ప్రకారం కాళ్లు కడుక్కోవడానికి మహిళలు నీళ్లు ఇచ్చారు. ఎవరూ కాళ్లు కడగలేదు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. ఐఏఎస్ వెంట్రామిరెడ్డితో కేసీఆర్ కాళ్లు మొక్కించుకున్నారు. ఒక్కో అందాల భామకు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం. 30 తులాలు కాదు కదా.. 3 గ్రాములు కూడా ఇవ్వలేదు. చౌమొహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లా ప్యాలెస్ లో జరిగిన విందులో ఒక్కో ప్లేట్ మీల్స్​కు రూ.ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చు చేశార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రచారం చేశారు. అదంతా అబద్ధం. ఒక్కో ప్లేట్ కు రూ. 8,200 మాత్రమే ఖర్చు చేశాం’’అని జూపల్లి అన్నారు.

మిల్లా మాగీ ఆరోపణల్లో వాస్తవం లేదు

తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి అన్నారు. కొందరు బీఆర్ఎస్ లీడర్లు కావాలనే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘‘మిస్ ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టారనేది నిజమైతే.. ఆ దేశం నుంచి రన్నరప్​ను పోటీలకు ఎలా పంపుతారు? మిగిలిన 108 మంది కంటెస్టెంట్లు కూడా చివరి వరకు ఉండేవాళ్లు కాదు.  ఏం జరగనిదానికి ఏదో జరిగినట్టు ప్రచారం చేశారు. వాళ్లను ఇబ్బందిపెట్టి ఉంటే.. మళ్లీ, మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎందుకు అంటరు?’’అని జూపల్లి అన్నారు. మిస్ వరల్డ్ గా నిలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆతిథ్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు ఎంతో నచ్చాయని తెలిపారు. 

జయేశ్ రంజన్ పై ఆరోపణల్లో నిజం లేదు

మిస్ వరల్డ్ పోటీలకు ముందు మే 28, 29వ తేదీల్లో టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ థాయ్‌‌లాండ్‌‌ వెళ్లారనే ఆరోపణల్లో నిజం లేదని మంత్రి జూపల్లి చెప్పారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. ‘జయేశ్ రంజన్ టూరిజం స్పెషల్ సీఎస్ హోదాలో అంతర్గతంగా విచారణ చేశారు. ఆ శాఖకు ఆయనే బాధ్యుడు. ఏం జరిగిందో తెలుసుకున్నారు’ అని జూపల్లి స్పష్టం చేశారు.

తెలంగాణ గౌరవం పెరిగింది: మంత్రి పొన్నం ప్రభాకర్
 
మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్ర ఖ్యాతి ఖండాంతరాలు దాటిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, కొంతమంది ఓర్వలేక ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు  ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ప్రభుత్వం సహకరించింది. ప్రజలను భాగస్వామ్యం చేశాం. రామప్ప, పోచంపల్లి, వెయ్యి స్తంభాల గుడి, కాకతీయుల కోట, ఓల్డ్ సిటీ తెలంగాణ చరిత్రాత్మక ప్రాంతాలు సంద ర్శించడం ద్వారా తెలంగాణ గౌరవం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ప్రతిపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడ్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణను ప్రపంచం గుర్తించేలా జరిగాయి’’అని పొన్నం అన్నారు.