కూల్​ రూఫ్​ ఖర్చు..మీటర్​కు రూ.3‌‌00

కూల్​ రూఫ్​ ఖర్చు..మీటర్​కు రూ.3‌‌00
  • 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు తప్పనిసరి
  • కూల్ ​రూఫ్​ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​
  • తెలంగాణ కూల్​రూఫ్​ పాలసీ ఆవిష్కరణలో కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : కూల్​ రూఫ్ ​పాలసీ పరిధిలో ఉన్న నిర్మాణాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇస్తామని, 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు ఇది వర్తిస్తుందని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ఒక మీటర్​ కూల్​రూఫింగ్​కు రూ.300 మించి ఖర్చవదని, బిల్డర్లు ముందే ప్లాన్​ చేసుకుంటే ఇంతకన్నా తక్కువతోనే పూర్తి చేయవచ్చని అన్నారు. ఇప్పటికే నిర్మించిన ఇండ్లు, కమర్షియల్ ​బిల్డింగులకు కూల్​రూఫింగ్​(రెట్రో ఫిట్టింగ్) చేయించుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కూల్ ​రూఫ్ ​పాలసీ 2023–28ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. 60‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 గజాల్లోపు నిర్మాణాలు చేసేవారు కూల్​రూఫింగ్​ఖర్చును కరెంట్​బిల్లు ఆదా రూపంలో రెండేండ్లలో రాబట్టుకోవచ్చన్నారు. తమ ఇంటికీ కూల్​రూఫింగ్​ చేయించుకున్న తర్వాతే మిగతావాళ్లు చేయాలని చెప్తున్నానన్నారు. ఒకప్పుడు గూన పెంకులు, డంగు సున్నంతో నిర్మాణాలు చేసేవారని.. ఇప్పటికీ పెద్ద పెద్ద ప్యాలస్​లకు వెళ్తే ఎంతో చల్లగా ఉంటుందన్నారు. వేగంగా నిర్మాణాలు చేయాలని వేడిని ఆకర్షించే స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్, వందల అంతస్తుల వల్లే హీట్​పెరుగుతోందన్నారు. 

జనాల మైండ్​సెట్​ అట్లనే ఉంటది

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఈ పాలసీని ఇప్పుడు రిలీజ్​చేస్తున్నామని కేటీఆర్​ చెప్పారు. 2018లో వనస్థలిపురంలోని ఈస్ట్​ఆనంద్​బాగ్​లో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయాయని, అప్పుడు నాలా వెడల్పు చేయాలని డిమాండ్​చేసినోళ్లే రెండు నెలల తర్వాత 300 ఇండ్లు తొలగిస్తామంటే వద్దన్నారని, జనాల మైండ్​సెట్​అలాగే ఉంటుందన్నారు. వాస్తు అంటే కొందరు మూఢనమ్మకం అనుకుంటారని, కానీ కేసీఆర్ వాస్తును నమ్ముతారని, వాస్తు కాన్సెప్ట్ లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు.

కేంద్రం, ఇతర రాష్ట్రాలు మిషన్​భగీరథ, మిషన్​ కాకతీయ, రైతుబంధు సహా మన స్కీంలు కాపీ కొట్టాయని, కూల్​రూఫ్​పాలసీలో మనం టార్గెట్ రీచ్ అయితే రేపు దేశం మొత్తం ఆచరిస్తుందన్నారు. ఓట్లు సీట్ల కోసం ఈ పాలసీ తేవడం లేదని, భవిష్యత్​తరాలకు మంచి చేయడానికే తీసుకువస్తున్నామని అన్నారు. 2030 నాటికి హైదరాబాద్ లో 200 కి.మీ., మిగతా నగరాల్లో 100 కి.మీ.లలో కూల్​రూఫింగ్​ అమలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను ప్రోత్సహిస్తం

ప్రభుత్వం నిర్మించే డబుల్​బెడ్రూం ఇండ్లు, సైక్లింగ్ ట్రాక్ లు, పేవ్ మెంట్లకు కూల్ పెయింట్స్​వేయిస్తామని కేటీఆర్​ చెప్పారు. వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు హైదరాబాద్ లో 500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, ప్రజలు కూడా ఎలాక్ట్రిక్ వెహికల్స్ వాడేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ మధ్య మనుషులు సడెన్​గా చనిపోతున్నారని, అందువల్ల ప్రతి అపార్ట్​మెంట్, కమ్యూనిటీలో సీపీఆర్​పై అవగాహన కల్పించే బాధ్యత జీహెచ్​ఎంసీ, మున్సిపల్​అధికారులు తీసుకోవాలన్నారు.

కూల్​రూఫ్​ పాలసీ అమలు చేసే వాళ్లకు ఇంటెన్సివ్​లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కూల్​రూఫ్​పాలసీతో పట్టణాలు, నగరాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గించవచ్చని ప్లక్ష యూనివర్సిటీ(చండీగఢ్) ప్రొఫెసర్​విశాల్​గార్గ్​తెలిపారు. ఆయనతోపాటు కూల్ రూఫ్ ఎడ్యుకేటర్ నీతూ జైన్ ప్రజంటేషన్లు ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్​గద్వాల్​విజయలక్ష్మి, ఎంఏయూడీ స్పెషల్​సీఎస్​అర్వింద్​కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్​లోకేశ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.