వైజాగ్ ​స్టీల్ ​ప్లాంట్​ను కాపాడుతం : కేటీఆర్  

వైజాగ్ ​స్టీల్ ​ప్లాంట్​ను కాపాడుతం : కేటీఆర్  
  • వైజాగ్ ​స్టీల్ ​ప్లాంట్​ను కాపాడుతం
  • బిడ్డింగ్​లో పాల్గొనడంపై అధ్యయనం చేస్తున్నాం  
  • నిజాం షుగర్స్​ను కోఆపరేటివ్ విధానంలో రీఓపెన్ చేస్తాం: కేటీఆర్  

హైదరాబాద్, వెలుగు : వైజాగ్ ​స్టీల్​ ప్లాంట్​ను కాపాడుతామని మంత్రి కేటీఆర్​అన్నారు. స్టీల్​ ప్లాంట్​బిడ్డింగ్​లో పాల్గొనడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపామన్నారు. నిజాం షుగర్స్​ పునరుద్ధరణకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా బయ్యారంలో స్టీల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాము ప్రధానిని కోరినప్పుడే వైజాగ్​ స్టీల్​ ప్లాంట్ ​ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. 

బయ్యారానికి160 కిలోమీటర్ల దూరంలోని బైలదిల్లా ఐరన్​ఓర్​మైన్స్​ను బయ్యారానికి కేటాయించాలని తాము కోరామని, దానికి విరుద్ధంగా కేంద్రం ఆ మైన్స్​ను అదానీకి కట్టబెట్టిందన్నారు. అదానీ కబంధహస్తాల్లో బైలదిల్లా ఉన్నంత కాలం ఇంకొకరు ప్లాంట్​పెట్టే అవకాశం లేదన్నారు. ‘‘ఇప్పటికే సిర్పూర్​పేపర్​మిల్లును పునరుద్ధరించాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేయాన్స్​ఫ్యాక్టరీ (బిల్ట్) పునరుద్ధరణపై ఐటీసీతో చర్చలు జరుపుతున్నాం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని కూడా కోఆపరేటివ్ విధానంలో రీఓపెన్ చేస్తాం” అని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే ఎలాంటి నష్టం జరుగుతుందో సీఎం కేసీఆర్ కు తెలుసని, అందుకే రైతుబీమాను ఎల్ఐసీ ద్వారా అమలు చేస్తున్నామన్నారు.  

అదానీ మైనింగ్ కాంట్రాక్ట్ రద్దు చెయ్యాలె   

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి విషయ పరిజ్ఞానం లేదని కేటీఆర్ అన్నారు. 2018 జూన్​లో తాను ప్రధాని మోడీని కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అదే ఏడాది సెప్టెంబర్​లో అదానీ బైలదిల్లా ఐరన్ ఓర్ కంపెనీని స్థాపించారన్నారు. అక్కడి ఐరన్​ఓర్​ను కొరియాకు చెందిన పాస్కో కంపెనీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. బయ్యారానికి బైలదిల్లా మైన్స్​కేటాయిస్తే అదానీకి నష్టం జరుగుతుందనే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. అదానీ కోసం కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల పొట్ట కొడుతోందన్నారు. అదానీ ఐరన్ ఓర్​ మైన్స్​ కాంట్రాక్టు రద్దు చేయాలన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పైతే కేంద్రం తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చన్నారు. 

కేటీఆర్​తో ఆదిత్య ఠాక్రే భేటీ  

మంత్రి కేటీఆర్ తో శివసేన (యూబీటీ) నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే భేటీ అయ్యారు. మంగళవారం టీ హబ్​లో వీరిద్దరు సమావేశమయ్యారు. టెక్నాలజీ, అర్బనైజేషన్, సస్టెయినబులిటీ దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనంగా పనిచేస్తుందని, దీనిపై తామిద్దరం చర్చించామని ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ వ్యతిరేక పక్షాల ఏకీకరణ సహా ఇతర అంశాలపై వీరి మధ్య చర్చజరిగినట్టు తెలిసింది. కాగా, అత్యున్నత రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధానాలుగా మారడం విచారకరమని కేటీఆర్​ట్వీట్​చేశారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు లేకపోగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇదేనా కోఆపరేటివ్​ఫెడరలిజం మోడల్, టీమ్​ఇండియా స్పిరిట్? అని ప్రశ్నించారు.