కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తప్పవ్ : పొంగులేటి 

కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తప్పవ్ : పొంగులేటి 
  • అమృత్ టెండర్లలో కరప్షన్ అవాస్తవం: పొంగులేటి 
  • రూ. 8 వేల కోట్ల అవినీతి ఆరోపణలను రుజువు చెయ్యాలె
  • రాజీనామాకు సిద్ధమని సవాల్

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తప్పవని, ఆయన తగిన మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

అమృత్ పథకంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రభుత్వంపై కేటీఆర్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియెట్​లో శనివారం మీడియాతో మంత్రి మాట్లాడారు. నిరుడు సెప్టెంబరు 20న టెండర్లు పిలిచింది నాటి బీఆర్ఎస్ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు.

తెల్లవారితే పోలింగ్ ఉండగా.. ఎన్నికల కోడ్ ఉన్నా 2023 నవంబర్ 29న రూ.3,515 కోట్ల ప్రైస్ బిడ్లను ఓపెన్ చేసింది.. మూడు కంపెనీలకు టెండర్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. పీఎల్ఆర్, ఏపీ పెద్దిరెడ్డి కంపెనీ, మేఘ- జేవీ, గజ కంపెనీలకు 3.99% ఎక్సెస్ తో ఇచ్చింది నాటి సర్కారే. పాత ఎస్ఎస్ఆర్ రేట్లతోనే మా ప్రభుత్వం టెండర్లను పిలిచింది.

జేవీ, సోదా కంపెనీలకు గతం కంటే రూ.54 కోట్లు తక్కువకే టెండర్లు ఇచ్చాం. రేవంత్ రెడ్డికి సృజన్ సొంత బావమరిది కాదు. ఆయన కేటీఆర్​కే దగ్గర వ్యక్తి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లోకి ఉపేందర్ వెళ్లినందుకు సృజన్​కు కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం. పాలమూరు–రంగారెడ్డిలో రూ.2,300 కోట్ల  ప్యాకేజీ 7 పనులను కేసీఆర్ ప్రభుత్వమే కట్టబెట్టింది’’ అని పొంగులేటి స్పష్టం చేశారు.    

కేటీఆర్ ది మిడిమిడి జ్ఞానం.. 

సీఎం రేవంత్ పై, ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు గుడ్డ కాల్చి మీద వేస్తున్నారని, అది మంచిది కాదని పొంగులేటి అన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. వాళ్ల కన్నా తక్కువకు టెండర్లు ఇచ్చామని, కేటీఆర్​ చెప్పినట్టు ఎక్కువకు ఇచ్చినట్టు తేలితే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలన్నారు. ఎక్కడికి రావాలో.. ఏ టైంకు రావాలో చెప్పాలంటూ సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ వాళ్లు ఆధారాలతో రావాలని, వారు చెప్పింది నిజమైతే తాను అక్కడే రాజీనామా చేస్తానన్నారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మిషన్ భగీరథతో రూ.34 వేల కోట్లను కొల్లగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్ ను అని, తన పనులపై ఎప్పుడైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. ప్రభుత్వం ఓపెన్​ టెండర్లను పిలిచిందని, క్వాలిఫై అయిన కంపెనీలకే టెండర్లు వచ్చాయన్నారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు.