
- దుబ్బాక రైతులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే బయటకు తీసుకెళ్లాలి
దుబ్బాక, వెలుగు: గత కేసీఆర్ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ప్రాజెక్ట్జలాలను దుబ్బాక నియోజకవర్గ రైతులకు ఇవ్వకపోతే పదవిని త్యాగం చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రకటించారు. బుధవారం దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి కమాన్వద్ద జలసాధన సమితి చేపట్టిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే కాంగ్రెస్ప్రభుత్వం కనీసం ఉప కాల్వలను నిర్మించడం లేదని రేవంత్సర్కార్కు రైతుల గోస పట్టడం లేదని విమర్శించారు.
ఏడాదిన్నర కాలంగా ఉప కాల్వలు నిర్మించి రైతులకు సాగు నీటిని అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మల్లన్న సాగర్తో నియోజకవర్గంలోని ఏడు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. మా కడుపు నిండిన తర్వాతే బయటకు నీళ్లను తీసుకెళ్లాలని, లేని పక్షంలో హైదరాబాద్కు తీసుకెళ్తున్న గోదావరి జలాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నేను రైతు బిడ్డనే రైతుల సమస్యలు తెలిసిన వాడినేనని రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదని, మల్లన్న సాగర్ నీళ్లను సాధించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఉప కాల్వల కోసం గత ప్రభుత్వం 90 శాతం నిధులను విడుదల చేసిందని, కాంగ్రెస్ సర్కార్ కనీసం ఉప కాల్వలకు నిధులను విడుదల చేయడం లేదని, హైదరాబాదుకు, ఇతర జిల్లాలకు నీళ్లను తరలించుకపోవడానికి నిధులను కేటాయిస్తోందని ఆరోపించారు. మన నీళ్లు మన దుబ్బాక నినాదంతో ముందుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరి కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు కడతల రవీందర్ రెడ్డి, సూకురి లింగం, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, నాయకులు కిషన్ రెడ్డి, రాజు, రాంరెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.